తెలంగాణా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇదే క్రమంలో తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదయింది.కాళేశ్వ‌రం ప్రాజెక్టు గొప్ప‌త‌నానికి మేడిగ‌డ్డ బ్యారేజీనే సాక్ష్య‌మ‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వ‌ర్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాజ్‌భ‌వ‌న్‌లో గ‌వ‌ర్న‌ర్ సీపీ రాధాకృష్ణ‌న్‌ను క‌లిసి పార్టీ ఫిరాయింపులు, నిరుద్యోగుల స‌మ‌స్య‌ల‌పై విన‌తిప‌త్రం అందించిన సంగ‌తి తెలిసిందే.బీఆర్‌ఎస్‌ ఎక్స్‌ అఫీషియల్‌ హ్యాండిల్‌లో ‘కాంగ్రెస్‌ కుట్రలను తట్టుకొని నిలిచిన కాళేశ్వరం ప్రాజెక్టు.. నిండు కుండలా మేడిగడ్డ బ్యారేజీ’ అంటూ ప్రాజెక్టుకు పోటెత్తిన వరద వీడియోను పోస్టు చేసిన సంగ‌తి తెలిసిందే. ‘మేడిగడ్డ బ్యారేజీ మొత్తం కుంగిపోయింది. కాళేశ్వరం కొట్టుకుపోయింది అని కాంగ్రెస్‌ పార్టీ, వందల కొద్దీ యూట్యూబ్‌ చానెళ్లు నెలల పాటు దుష్ప్రచారం చేసినా.. వాళ్ల కుళ్లు, కుతంత్రాలను కడిగేస్తూ లక్షల క్యూసెకుల వరద నీరు నేడు మేడిగడ్డ వద్ద ప్రవహిస్తున్నది. తెలంగాణ రాష్ట్ర ఎదుగుదలను చూసి ఓర్వలేని సన్నాసులు ఎన్ని కుట్రలు చేసినా కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు జీవధార. కేసీఆర్‌పై, కాళేశ్వరం మీద బురదజల్లే ప్రయత్నం ఎవరు చేసినా చరిత్ర హీనులుగా మిగిలిపోవడం ఖాయం.అని కేటీఆర్ చెప్పిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో అనుమతి లేకుండా మేడిగడ్డ బ్యారేజ్ వద్ద డ్రోన్ ఎగరేశారంటూ..ఇరిగేషన్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కేటీఆర్‌తో పాటు పార్టీ నాయకులు గత నెల 26న మేడిగడ్డ బ్యారేజ్‌ను సందర్శించారు. అయితే మేడిగడ్డ బ్యారేజ్‌ను సందర్శించడానికి కేటీఆర్ ఎటువంటి ముందుస్తు అనుమతులు తీసుకోలేదని అధికారులు తెలిపారు.అనుమతి లేకుండా మేడిగడ్డ బ్యారేజ్‌ను సందర్శించడమే కాకుండా డ్రోన్ ఎగరేసి అక్కడున్న దృశ్యాలను కెమెరాలో చిత్రీకరించారని ఇరిగేషన్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేటీఆర్‌తో పాటు బీఆర్ఎస్ నాయకులు బాల్క సుమన్, గండ్ర వెంకటరమణా రెడ్డిల మీద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ పీఎస్‌లో బీఎన్ఎస్ 223(b) సెక్షన్ కింద కేటీఆర్ మీద ఎఫ్ఐఆర్ నమోదైంది.

బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. మొన్నే భూపాలపల్లి కోర్టు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌కు నోటీసులు పంపింది. వచ్చే నెల 5వ తేదీన కోర్టులో వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది. తాజాగా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కేసు నమోదైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్ పీఎస్‌లో ఈ కేసు ఫైల్ అయింది. గత నెల 29వ తేదీన 778/2024 ఎఫ్ఐఆర్ పేరుతో ఈ కేసు నమోదైంది.మేడిగడ్డ బ్యారేజీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. గత నెల 26వ తేదీన మధ్యాహ్నం పూట బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఆయనతోపాటు బీఆర్ఎస్ పార్టీకి చెందిన గండ్ర వెంకటరమణా రెడ్డి, బాల్క సుమన్, కార్యకర్తలు, బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రతినిధులు, మరికొందరు కలిసి మేడిగడ్డ బ్యారేజీని సందర్శించారు. ఇక్కడ డ్రీన్ విజువల్స్‌ను వారు చిత్రీకరించారు. ఈ విషయం తమకు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తమ దృష్టికి వచ్చిందని అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ తెలిపారు.ఈ విషయాన్ని తాను పై అధికారుల దృష్టికి తీసుకెళ్లానని, ఈ మేడిగడ్డ బ్యారేజ్ తెలంగాణకు అతి ముఖ్యమైన ప్రాజెక్ట్ అని, కాబట్టి ఇలాంటి చర్యల వలన బ్యారేజీకి ముప్పు పొంచి ఉండే అవకాశం ఉందని చెప్పినట్టు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ తెలిపారు. కాబట్టి, ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, అనుమతులు తీసుకోకుండా డ్రోన్ ఎగరవేసిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోగలరని పోలీసులకు ఫిర్యాదు కాపీలో విజ్ఞప్తి చేశారు.పోలీసులు ఈ ఫిర్యాదు కాపీని స్వీకరించారు. కేసు నమోదు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: