ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు పరిపాలనా కార్యాలయంలో దస్త్రాలు దగ్ధం కావడం చర్చనీయాంశమైంది. పోలవరం ఎడమ ప్రధాన కాలువ భూసేకరణ సంబంధించిన దస్త్రాలు దగ్ధమైనట్లు సమాచారం. లబ్ధిదారుల పరిహారం అక్రమాలు బయటకు వస్తాయనే కార్యాలయంలోని అధికారులే దస్త్రాలు కాల్చేశారని అనుమానం కలుగుతోంది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కాలిపోయిన దస్త్రాలను పరిశీలించారు. శుక్రవారం రాత్రి దస్త్రాలు తగలబెట్టి ఉంటారని అనుమానిస్తున్నారు.
పత్రాలు దగ్ధం అయితే ఆధారాలు ఉండవా అని ప్రశ్నించారు. పత్రాలన్నీ డిజిటలైజేషన్ జరిగాయన్నారు. మదనపల్లె సబ్ కార్యాలయంలో ఫైళ్లు దగ్ధం అయితే మంత్రి పెద్దిరెడ్డి తగులబెట్టించారని కొందరు నేతలు ప్రచారం చేశారని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు పత్రాలు ఒక్క చోటే ఉంటాయా అని ప్రశ్నించారు.ఫైళ్ల దగ్ధంపై ఆధారాలు ఉంటే కేసులు పెట్టాలని సూచించారు.అబద్ధాలను నమ్మించే ప్రయత్నాలు ఎంతకాలం చేస్తారని మాజీ మంత్రి అంబటి నిలదీశారు.
ఇదిలా ఉంటే ఫైళ్ల దగ్ధం ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.ఫైళ్లు దగ్ధం జరిగిన ప్రాంతాన్ని పోలవరం స్పెషల్ కలెక్టర్ సరళ పరిశీలించారు. ఫైళ్ల దగ్ధంపై అధికారుల నుంచి ఆరా తీశారు. అయితే దగ్ధమైన పత్రాలు ఉపయోగంలో లేనివని అధికారులు స్పష్టం చేశారు. నిరుపయోగంగా ఉన్న పేపర్లను మాత్రమే తగలబెట్టామని తెలిపారు. పోలవరం ఎడమకాలువ పరిహారం ఫైల్స్ కాదని చెప్పారు. పోలవరం LMC ఆఫీసులో పనికిరాని కాగితాలనే పడేశామన్నారు. ఆ పేపర్లతో ఆర్ అండ్ ఆర్కు సంబంధం లేదని తెలిపారు. సిబ్బంది తగలబెట్టిన కాగితాలు ఉపయోగం లేనివని స్పెషల్ కలెక్టర్ సరళ స్పష్టం చేశారు.