* కేసిఆర్ రాజకీయ జీవితాన్ని మలుపు తెప్పిన తెలంగాణ ఉద్యమం..
* ఆమరణ నిరాహార దీక్షతో కేంద్రం మెడలు వంచిన కేసీఆర్..
* ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కలను సాకారం చేసిన ఘనుడు..

సాధారణంగా ప్రతి రాజకీయ నాయకుడి ప్రస్థానంలో ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది. కేవలం ఒకే ఒక్క ఘటన సాదాసీదా రాజకీయ నాయకుడిగా ఉన్న వారిని ఒక్కసారిగా దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిపోయేలా చేస్తూ ఉంటుంది. అయితే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ జీవితంలోను ఇలాంటి ఘటనే ఒకటి ఉంది. అదే తెలంగాణ రాష్ట్ర సాధనకై చేసిన ఉద్యమం.. కేసిఆర్ పూనుకున్న ఆమరణ నిరాహార దీక్ష. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే టిడిపి నుంచి బయటికి వచ్చి తెలంగాణ రాష్ట్రీయ సమితి అనే పార్టీని స్థాపించారు కేసీఆర్. అప్పటినుంచి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పోరాటం సాగిస్తూనే వచ్చారు.


 ఈ క్రమంలోనే 2009లో పోరాటాన్ని ఉధృతం చేయాలని కేసిఆర్ నడుం బిగించారు. ఇక తెలంగాణ ప్రజానీకాన్ని మొత్తం ఒక్కతాటిపైకి తీసుకువచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. 2009 నవంబర్ 29న ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్షకు పూనారు. కరీంనగర్లోని ఉత్తర తెలంగాణ భవన్ నుంచి సిద్దిపేట దగ్గర రంగనాథం పల్లి లో ఏర్పాటుచేసిన దీక్షా స్థలి వద్దకు బయలుదేరారు కేసిఆర్. అయితే కెసిఆర్ వాహనాన్ని పోలీసులు ముట్టడించడంతో ఎక్కడ ఆపితే అక్కడే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని చెప్పారు. కెసిఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో ముందుకు సాగారు. సాదుకుంటారా సంపుకుంటారా ఇక మీ ఇష్టం అని తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు.



 అందరిలో ఒక్కడిలా కాదు.. అందరికీ ఒక్కడై ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. పోలీసులు దీక్షను భగ్నం చేసి ఖమ్మం జైలుకు తరలిస్తే జైలు నుంచే దీక్షను ప్రారంభించారు. ఇక కేసిఆర్ ఆమరణ నిరాహారదీక్ష సమయంలో తెలంగాణలో చిన్న పిల్లోడు సైతం జై తెలంగాణ నినాదాలు పలుకుతూ ఉద్యమం వైపు ఉవ్వెత్తున సాగిపోయారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎంతోమంది యువకులు ఇక దీక్షకు మద్దతు తెలుపుతూ ఆత్మ బలిదానం కూడా చేసుకున్నారు. ఇక ఆ సమయంలో కేంద్రం మెడలు వంచడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారు. తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఏకంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిపెట్టారు. అందుకే  కెసిఆర్ పేరు ఎప్పుడు వినిపించినా ఆయన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం చేసిన ఆమరణ నిరాహార దీక్షే ముందుగా గుర్తుకు వస్తూ ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: