మాచర్లవైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి భారీ ఊరట లభించింది. ఈవీఎం ధ్వంసంతో సహా మూడు కేసుల్లో ఆయనకు షరతులతో కూడిన బెయిల్ ను ఏపీ హైకోర్టు మంజూరు చేసింది.ఎన్నికల సమయంలో టీడీపీ ఏజెంట్, సీఐపై దాడి, ఈవీఎం ధ్వంసం కేసుల్లో పిన్నెల్లిని జూన్ 26న పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దాదాపు రెండు నెలలుగా నెల్లూరు సెంట్రల్ జైలులో ఉంటున్నారు.2014, 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు పిన్నెల్లి. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు మాజీ సీఎం జగన్ పిన్నెల్లిని ప్రభుత్వ విప్‌గా నియమించారు. ఈసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పిన్నెల్లి మాచర్ల నుంచి బరిలోకి దిగారు. అయితే మే 13న పోలింగ్ రోజున.. రెంటచింతల మండలం పాల్వాయి గేట్‌ 202 పోలింగ్ కేంద్రంలో చొరబడి ఆయన ఈవీఎంను ధ్వంసం చేశారు. సీసీటీవీ కెమెరాల్లో రికార్డైన ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. టీడీపీ నాయకులు, కార్యకర్తలు రిగ్గింగ్‌కు పాల్పడినందు వల్లే ఈవీఎంను పిన్నెల్లి ధ్వంసం చేశారని వైసీపీ వాదిస్తోంది.అయితే పోలింగ్ రోజున మాచర్లలో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. అదే రోజున సాయంత్రం పోలీసులు పిన్నెల్లిని గృహనిర్బంధంలో ఉంచారు. ఆ తర్వాత అల్లర్లపై పోలీసులు విచారణ ప్రారంభించడంతో ఆయన మే 14 నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మరోవైపు ఈవీఎంను పగలగొట్టిన వ్యవహారాన్ని ఎన్నికల సంఘం సీరియస్‌గా తీసుకుంది. పిన్నెల్లిని అరెస్టు చేయాలని ఆదేశించింది. దీంతో పోలీసులు ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు కేసులు నమోదు చేశారు. పాల్వాయి గేటు పోలింగ్ బూత్‌లో ఈవీఎం ధ్వంసం కేసు, సీఐపై దాడి, టీడీపీ ఏజెంట్స్ పై దాడి, మహిళలను దూషించిన కేసు ఇలా మొత్తం ఆయనపై నాలుగు కేసులు నమోదయ్యాయి.ఇదిలాఉంటే.. పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ప్రస్తుతం జైల్లో ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: