తెలుగు అమ్మాయి అయినా ఆర్కే రోజా.. తెలుగుతోపాటు, తమిళంలో కూడా సినిమాలలో బాగా పాపులర్ అయ్యారు. రోజాకు తెలుగు ప్రజలు మంచి స్టార్ డం ఇమేజ్ కట్టబెట్టారు. అయితే ఆమె తమిళ దర్శకుడు ఆయిన ఆర్కే సెల్వమణిని ప్రేమ వివాహం చేసుకొని చెన్నైలో సెటిల్ అయ్యారు. 2004 ఎన్నికలకు ముందు తెలుగు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రోజా.. తెలుగుదేశం పార్టీ నుంచి నగరి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం 2009 ఎన్నికలలోను ఆమె తెలుగుదేశం నుంచి చంద్రగిరిలో మాజీ మంత్రి గల్లా అరుణ్ కుమార్ పై పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో.. ఆమె వైయస్ఆర్ చెంత‌కి వెళ్లారు.


ఆయన మరణానంతరం.. ఆయన తనయుడు జగన్ రెడ్డి స్థాపించిన వైసీపీలోకి వెళ్లిన రోజా 2014, 2019 ఎన్నికలలో వరుసగా నగరి నియోజకవర్గంలో నుంచి రెండుసార్లు వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ రెండు ఎన్నికలలోను ఆమె స్వల్ప మెజార్టీతోనే ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం ఆమె చివరి మూడు సంవత్సరాలు జగన్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. ఈ ఏడాది జరిగిన ఎన్నికలలో మాత్రం రోజా నగరి నుంచి పోటీచేసి.. టీడీపీ నుంచి పోటీ చేసిన యువనేత గాలి భానుప్రకాష్ నాయుడు చేతిలో దారుణంగా ఓడిపోయారు.



అక్కడి వరకు బాగానే ఉంది.. ఎన్నికల్లో ఓటమి తర్వాత రోజా ఆంధ్రప్రదేశ్‌లో ఉండటం లేదు. తన ఫ్యామిలీతో కలిసి ఎక్కువగా చెన్నైలోనే ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఆమె గురించి ఓ ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. రోజా తమిళ రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారని ప్రచారం జరుగుతుంది. ఇటీవల తమిళ్ హీరో దళపతి విజయ్ తమిళ వెట్రి కళ‌గం అనే రాజకీయ పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రోజా ఆ పార్టీలోకి జంప్‌ కానున్నారని.. వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్నికల్లో వైసిపి ఘోర ఓటమి తర్వాత రోజా నగరి నియోజకవర్గంలో పర్యటించేందుకు ఇష్టపడటం లేదు.


నగరిలో ఆమె ఇల్లు కట్టుకున్నా అక్కడ ఉండటం లేదు. ఎక్కువగా చెన్నైలోనే ఉంటున్నారు. తెలుగు బుల్లితెర షోలలో కూడా రోజాకు అవకాశాలు ఇచ్చేందుకు చాలామంది ఇష్టపడటం లేదట. ఈ క్రమంలోనే ఆమె తమిళ బుల్లితెరపై షోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది. ఇక విజయ్ పార్టీ నుంచి వచ్చే ఏడాది తమిళనాడులో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో ఆమె పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: