ఏపీలో కొత్త ప్రభుత్వం ఆర్థిక పరిస్థితులను గాడిన పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం అమరావతి, పోలవరానికి అధిక ప్రాధాన్యం ఇస్తోంది. కేంద్రం ఈ రెండు ప్రాజెక్టులకు తాజాగా సహకారం అందిస్తూ నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో కేంద్ర నుంచి వచ్చే ప్రతి రూపాయి సద్వినియోగం చేయాలని భావిస్తోంది. ఇతర పథకాల కోసం వచ్చిన రుణాలను సంక్షేమ పథకాలకు మళ్లించలేమని ఏపీ ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు.


ఏపీకి కేంద్రం నుంచి అమరావతికి ప్రకటించిన రుణం పైన రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ చెప్పారు.  ఈ రూ.15వేల కోట్లను కేంద్రం ఈఏపీ అప్పుగా తెచ్చి రాష్ట్రానికి ఇస్తుందని తెలిపారు. తిరిగి ఆ అప్పుకు పూర్తిగా 100 శాతం కేంద్రమే చెల్లిస్తుందని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి రాష్ట్రంపై ఎలాంటి భారం పడదని వివరించారు. గత ఐదేళ్లలో నిర్వీర్యమైన కేంద్ర ప్రభుత్వ  పథకాలను తిరిగి గాడిలో పెడుతున్నట్లు చెప్పారు.


కేంద్రం నుంచి వచ్చే ప్రతి రూపాయి తీసుకొచ్చి సద్వినియోగం చేస్తామని అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి సెప్టెంబరు వరకు వాడుకోవడానికి కేంద్రం ఇచ్చిన అప్పుల అనుమతి రూ.47వేల కోట్లు దాదాపు పూర్తి కావొచ్చిందని తెలిపారు. అక్టోబరు-డిసెంబరు కాలానికి మరో 0.5 శాతం అంటే రూ.8వేల కోట్ఉల అనుమతి వచ్చే అవకాశం ఉందన్నారు.  ఇది కాకుండా చివరి త్రైమసికంలో మరికొంత అప్పునకు కేంద్రం అనుమతి ఇస్తోందని పేర్కొన్నారు.


 గత ప్రభుత్వం కార్పొరేషన్ల ద్వారా అప్పులు తెచ్చి భారీ ఎత్తున సంక్షేమ పథకాలకు ఖర్చు పెట్టిందని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలా తాము నిధులు మళ్లించమని.. ఆ తప్పు తాము చేయబోమని చెప్పారు. కార్పొరేషన్లు వాటి అవసరాల మేరకు అప్పులు తెచ్చుకొని వాడుకుంటాయని తెలిపారు. ఐదేళ్ల పాటు పేరుకుపోయిన పెండింగ్ బిల్లులు ఒక్కరోజులో చెల్లించలేమని దీనికి చాలా సమయం పడుతుందని పీయూష్ కుమార్ అన్నారు. ఖజానాకు ఆదాయం పెంచడంతో పాటు సాధ్యమైనంత వరకు ఖర్చులు తగ్గించుకుంటామని చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: