ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఒక్కటంటే ఒక్క సీటు కూడా వైసీపీ గెలవలేకపోయింది. టీడీపీ కూటమి క్లీన్ స్వీప్ తో జిల్లాలో వైసీపీ పార్టీకి కోలుకోలేని దెబ్బతగిలింది. గుంటూరు జిల్లాలో ముఖ్యమైన నియోజకవర్గాల్లో మంగళగిరి ఒకటి. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రామకృష్ణారెడ్డి పార్టీ ఓటమి తర్వాత ఎక్కడా కూడా కనిపించలేదు. అతని మాట కూడా వినిపించడం లేదు. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ ను ఓడించి సంచలనం సృష్టించారు ఆర్కే.


మొన్నటి ఎన్నికల్లో ఆర్కేని పక్కన పెట్టిన బీసీలకు మంగళగిరి టికెట్ కేటాయించింది వైసీపీ అధిష్టానం. దీంతో పార్టీపై అలిగిన ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత మళ్లీ మనసు మార్చుకుని పార్టీలోకి తిరిగి వచ్చారు. 2014లో ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓడిపోయిన గంజి చిరంజీవిని మొదట మంగళగిరి అభ్యర్థిగా వైసీపీ అధిష్టానం నిర్ణయించింది. అయితే చిరంజీవికి టికెట్ ఇవ్వడాన్ని ఆర్కే వ్యతిరేకించారు. అతని అలక పార్టీని వీడే వరకు వెళ్ళింది.


దీంతో గంజి చిరంజీవి స్థానంలో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు కోడలు లావణ్యకు వైసీపీ సీట్ ప్రకటించారు. దీంతో వైసీపీలోకి తిరిగి వచ్చిన ఆర్కే లావణ్య విజయం కోసం గట్టిగానే ప్రయత్నాలు చేశారు. అయితే ఈసారి వైసీపీ అనుకున్నన్ని అద్భుతాలు ఏమి సృష్టించలేకపోయింది. పైగా నారా లోకేష్ రికార్డు స్థాయిలో 90,000 మెజారిటీతో గెలుపొందారు. లోకేష్ ఘనవిజయంతో పాటు టీడీపీ కూటమి అధికారులు రావడంతో మంగళ గిరిలో వైసీపీ ఓటమిపాలైంది.


ఎన్నికల వరకు పార్టీ కోసం కష్టపడిన ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రస్తుతం నియోజకవర్గానికి రావడం లేదు. ఇక పోటీ చేసిన మొదటిసారి ఓటమి పాలైన లావణ్య ఇంటికే పరిమితమయ్యారు. ఆటు గంజి చిరంజీవి కూడా పార్టీని అంటి ముట్టనట్లే ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీని నడిపించే నాయకుడి కోసం మంగళగిరి వైసీపీ శ్రేణులు ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: