పవన్ కళ్యాణ్ పోటీకి సిద్ధమైనప్పటినుంచి ప్రపంచం అంతటా పిఠాపురం పేరు మార్మోగిపోయింది. పవన్ కళ్యాణ్ అఖండ విజయం సాధించడంతో ఈ నియోజకవర్గం ఇప్పటికే పొలిటికల్ గా హాట్ టాపిక్ అవుతుంది. తాజాగా ఇప్పుడు మరోసారి రాజకీయంగా పిఠాపురం చర్చనీయాంశం అవుతుంది. దానికి గల కారణం అక్కడ మారుతున్న రాజకీయ సమీకరణాలు, నేతల చేరికలు. నిన్న మొన్నటి వరకు ఎడమొహం పెడమొహంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ, మాజీ ఎమ్మెల్యే దొరబాబు ఇప్పటినుంచి కూటమిలో కలిసి పని చేయబోతున్నారని అనేక సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.



గతంలో వీరిద్దరూ రాజకీయ శత్రువులుగా ఉండేవారు. ఇక ఇప్పుడు కలిసి పని చేయడానికి సిద్ధమవుతున్నారు. 2019లో ఇదే పిఠాపురం మంచి వైసీపీ ఎమ్మెల్యేగా దొరబాబు విజయం సాధించారు. అయితే ఇందులో మార్పులు చేర్పులు చేస్తూ దొరబాబుకు తాజా ఎన్నికల్లో వైసీపీ టికెట్ ఇవ్వలేదు. వంగ గీతకు వైసీపీ టికెట్ ఇచ్చి పవన్ కళ్యాణ్ పై పోటీకి దించింది. అప్పటినుంచి అతను అసంతృప్తిగానే ఉన్నారు. దొరబాబు ఫలితం రాగానే రూట్ మార్చేశారు. గతవారం వైసీపీకి గుడ్ బై చెప్పేసిన దొరబాబు కూటమిలోకి వెళ్తానని ప్రకటించారు.


అయితే దశాబ్దకాలం నుంచి దొరబాబుపై రాజకీయ పోరాటం చేస్తున్న వర్మ టీడీపీ ప్రతినిధిగా కూటమిలో బలంగా ఉన్నారు. అయితే జనసేనలోకి దొరబాబు ఎంట్రీ ఇవ్వనున్నారట. అయితే కూటమిలో ఈ ఇద్దరి కలయిక ఎలా సాధ్యం అని చర్చ జరుగుతుంది. మొదటి నుంచి వర్మ టీడీపీకి బలమైన నాయకుడిగా ఉన్నారు. 2009 నుంచి టీడీపీ తరఫున వర్మ బరిలో ఉంటున్నారు. 2014లో గెలిచిన వర్మ 2019లో ఓటమి పాలయ్యారు.


అయితే ఇటీవల మరోసారి పోటీకి సిద్ధమైనప్పటికీ చంద్రబాబు మాట మేరకు పిఠాపురంలో కూటమి తరపున పవన్ అభ్యర్థిత్వానికి ఒప్పుకున్నారట. ఆయనే దగ్గరుండి ప్రచార పర్వాన్ని నడిపించి పవన్ గెలుపులో కీలకపాత్ర పోషించారని, ప్రతి గ్రామంలో ప్రత్యేకమైన వర్గం ఏర్పరచుకున్న వర్మ పిఠాపురంలో బలమైన నాయకుడిగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన పక్కన చిరకాల ప్రత్యర్ధిని, అందులోనూ ఓ మాజీ ఎమ్మెల్యేను దించి అతని పక్కన కూర్చోపెడుతున్నారు. అయితే కావాలనే దొరబాబును జనసేనలోకి రప్పిస్తున్నారనే టాక్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: