చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ.. వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్గా వ్యవహరించారు. బీసీలలో బలమైన.. శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన వేణు ఇటు పారిశ్రామికవేత్తగాను ఉన్నారు. రాజశేఖర్ రెడ్డి మరణంతో ఆయన తనయుడు జగన్ పెట్టిన పార్టీలోకి వెళ్లారు. ఈ క్రమంలోని 2014 ఎన్నికలలో వేణుగోపాలకృష్ణ రామచంద్రపురం అసెంబ్లీ సీటు ఆశించారు. కానీ.. జగన్ ఆయనను కాకినాడ రూరల్ నుంచి పోటీ చేయించుగా.. ఆ ఎన్నికలలో పిల్లి అనంతలక్ష్మి చేతిలో వేణుగోపాలకృష్ణ ఓడిపోయారు. 2019 ఎన్నికలకు వచ్చేసరికి కాకినాడ రూరల్ సీటును మాజీ మంత్రి కురసాల కన్నబాబుకు ఇవ్వాల్సి రావడంతో.. వేణుగోపాలకృష్ణను రామచంద్రపురం నుంచి పోటీ చేయించారు.


ఆ ఎన్నికలలో రామచంద్రపురం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ.. జగన్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా ఉన్నారు. ఇక ఈ ఎన్నికలలో ఆయన మరోసారి రామచంద్రపురం నుంచి పోటీ చేయాలని అనుకున్నారు. వేణుగోపాల కృష్ణ స్వస్థలం బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని.. రాజోలు నియోజకవర్గం కావటం విశేషం. అయితే ఈసారి ఎన్నికలలో కూడా జగన్ వేణుగోపాలకృష్ణకు పెద్ద షాకే ఇచ్చారు. రామచంద్రపురం నుంచి ఆయనను బలవంతంగా తప్పించి.. ఆయనకు సంబంధం లేని రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయమని చెప్పారు. అక్కడ పోటీ చేసేందుకు వేణుగోపాలకృష్ణకు ఇష్టం లేకపోయినా.. బలవంతంగా పోటీచేసి ఓడిపోవలసి వచ్చింది.


వేణుగోపాలకృష్ణపై టిడిపి సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి ఏకంగా 65 వేల ఓట్ల భారీ మెజార్టీతో ఘనవిజయం సాధించారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత వేణుగోపాలకృష్ణ తనకు తిరిగి రామచంద్రపురం నియోజకవర్గ పగ్గాలు ఇవ్వాలని కోరారు. అయితే జగన్ తాజాగా వేణుగోపాలకృష్ణను తూర్పుగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నియమించారు. అంటే నీకు రామచంద్రపురం ఇవ్వను.. నువ్వు రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలోని పని చేసుకో అని చెప్పకనే చెప్పారు. ఎందుకంటే రాజమహేంద్రవరం రూరల్ తూర్పుగోదావరి జిల్లా పరిధిలోనే ఉంది. వేణు అడిగింది రామచంద్రపురం పార్టీ పగ్గాలు. అయితే జగన్ తూర్పుగోదావరి జిల్లా పార్టీ పగ్గాలు ఇచ్చి.. నీ నియోజకవర్గం మార్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పినట్టు అయింది. మరి వేణు అయష్టంగానే రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తల మ‌న‌స్సును గెలుచుకోవాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: