ఈ మధ్య కాలంలో భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాల ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్న సంగతి తెలిసిందే. వరదల వల్ల రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు పడిన ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. విజయవాడ ప్రజలు ఇప్పుడిప్పుడే ఈ సమస్యల నుంచి కోలుకుంటున్న తరుణంలో ఉత్తరాంధ్ర ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వాయుగుండం ప్రభావం వల్ల గత రెండు రోజులుగా ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
 
ఆదివారం ఉదయం నుంచి రాత్రి 7 గంటల వరకు విజయనగరం జిల్లా చీపురుపల్లిలో 10.35 సెంటిమీటర్ల వర్షపాతం నమోదు కావడం గమనార్హం. శనివారం రాత్రి నుంచి కురుస్తున్న వానల వల్ల ఉమ్మడి విజయనగరం, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాల్లో గెడ్డలు పొంగి రాకపోకలు నిలిచిపోయాయి. విజయనగరం జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ఇళ్లు సైతం ముంపు బారిన పడటం గమనార్హం.
 
లావేరు, సిగడాం మండలాలలో రాకపోకలు నిలిచిపోగా ఒక సరుకుల వ్యాన్ కొట్టుకునిపోయింది. డ్రైవర్ మాత్రం స్థానికుల సాయంతో పెను ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఎడతెరపి లేని వర్షాల వల్ల విశాఖలోని గోపాలపట్నంలో కొండచరియ విరిగి పడగా ఆ కొండచరియ వల్ల రక్షణ గోడ కుప్పకూలింది. ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తరాంధ్ర ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకుంటోంది.
 
ఉత్తరాంధ్ర ప్రజలు ఒకింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. వరదల వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. అవసరమైన ప్రాంతాలలో రిటైనింగ్ వాల్స్ ను నిర్మించాల్సి ఉంది. భవిష్యత్తులో భారీ వరదలు వచ్చినా ప్రజలు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం చర్యలు చేపడితే మంచిది. ఉత్తరాంధ్ర జిల్లాలలో ఏ ఒక్కరూ మృతి చెందకుండా ప్రభుత్వం చర్యలు చేపడితే బాగుంటుందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. భారీ వర్షాల వల్ల ప్రజలు మాత్రం తీవ్రస్థాయిలో నష్టపోతున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.






మరింత సమాచారం తెలుసుకోండి: