ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా పొందలేకపోయిన వైసిపి అష్ట కష్టాలు పడుతోంది. ఇప్పుడు వైసీపీ పెనుసంక్షోభంలో చిక్కుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న మొత్తం 175 నియోజకవర్గాలలో ఆ పార్టీ నుంచి కేవలం 11 మంది మాత్రమే ఎమ్మెల్యేలుగా గెలిచారు. 25 లోక్‌స‌భ నియోజకవర్గాలలో నలుగురు మాత్రమే ఎంపీలుగా విజయం సాధించారు. అయితే అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 100 నియోజకవర్గాలలో పెద్ద సంక్షోభం నెలకొన్నట్టు తెలుస్తోంది. అసలు వైసీపీ తరఫున పార్టీ కార్యక్రమాలు చేపట్టే నేతలు కూడా ఎవరూ లేరుస‌.


గత ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయిన నియోజకవర్గాల ఇన్చార్జిలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, పార్టీ జిల్లా అధ్యక్షులు ఎవరు కూడా నియోజకవర్గాలను పట్టించుకునే పరిస్థితిలో లేరు. అసలు పార్టీ కేడర్ను ఏ మాత్రం పట్టించుకోని పరిస్థితి నెలకొంది. ఆళ్ల నాని, కిలారు రోశయ్య, గంటా పద్మశ్రీ, పోతుల సునీత, బీద మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ, ఈపూరు గణేష్, మద్దాలి గిరిధర్ రావు ఇలా చాలామంది నేతలు పార్టీ నుంచి బయటికి వచ్చేస్తున్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక రేంజ్ లో హడావిడి చేసిన మాజీ మంత్రి విడుదల రజనీ లాంటి వాళ్ళు సైతం సైలెంట్ అయిపోయారు.


ఓవరాల్ గా 100 నియోజకవర్గాలలో పార్టీ జెండా ముందుగా పట్టుకుని నడిపించే నాయకుడు, ఇన్చార్జ్ లేడంటే పార్టీలో ఎంత సంక్షోభం ఉందో తెలుస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే 100 నియోజకవర్గాలలో వచ్చే ఎన్నికలలో వైసీపీ తరఫున పూర్తి చేసేందుకు బలమైన అభ్యర్థులు లేని పరిస్థితి. ఒకవేళ నియోజకవర్గాల‌ పున‌ర్విభ‌జ‌న జ‌రిగి అదనంగా మరో 50 నియోజకవర్గాలు కలిస్తే మొత్తంగా 150 అసెంబ్లీ నియోజకవర్గాలలో వైసీపీకి అభ్యర్థులు దొరకని పరిస్థితి. చివరకు పార్టీ ఇన్చార్జిలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఏఎంసీ చైర్మన్లు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, ద్వితీయ శ్రేణి నాయకులు కూడా పార్టీ మారిపోతూ ఉండడంతో.. గతిలేక తృతీయ శ్రేణి నాయకులకు, మండల స్థాయి నాయకులకు జగన్ ఇన్చార్జి పగ్గాలు అప్పగిస్తున్న పరిస్థితి నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: