ఏపీ రాజకీయాల గురించి కనీస అవగాహన ఉన్నవాళ్లకు సైతం నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కోవూరు నియోజకవర్గం నుండి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నల్లపరెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ, నిజాం కాలేజ్, హైదరాబాద్‌ నుండి బీఏ పూర్తి చేయడం జరిగింది. 1993 సంవత్సరంలో తండ్రి మరణాంతరం ఆయన రాజకీయాల్లోకి వచ్చారు.
 
1994 సంవత్సరంలో కోవూరు పశ్చిమ నియోజవర్గం నుండి టీడీపీ తరఫున పోటీ చేసి ఆయన గెలిచారు. ఆ సమయంలో నల్లపరెడ్డి ఎన్టీఆర్ మంత్రివర్గంలో చక్కెర కర్మాగారాల శాఖ మంత్రిగా పని చేయడం ద్వారా ప్రశంసలు పొందారు. 1999 సంవత్సరం మరోసారి టీడీపీ నుంచి పోటీ చేసిన ఆయన ఆ ఎన్నికల్లో సైతం విజయం సాధించారు. 2004 ఎన్నికల ఫలితాలు షాకిచ్చినా 2009లో టీడీపీ నుంచి పోటీ చేసి మూడోసారి సైతం నల్లపరెడ్డి విజయం సాధించారు.
 
2011 సంవత్సరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన తన పదవికి రాజీనామా చేసి 2012 ఉపఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పై 23,494 ఓట్ల మెజార్టీతో విజయం సాధించడం గమనార్హం. 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసిన నల్లపరెడ్డి ఓటమిపాలవగా 2019లో జగన్ వేవ్ వల్ల మళ్లీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
 
2024 ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోయినా భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో కోరుకున్న విజయం దక్కుతుందని ఆయన భావిస్తున్నారు. అటు టీడీపీలో ఉన్నా ఇటు వైసీపీలో ఉన్నా నల్లపరెడ్డి హీరోనే అని ఇందులో ఎలాంటి సందేహం అక్కర్లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఏ పార్టీలో ఉన్నా తన మార్క్ నిర్ణయాలతో ఈ నేత ప్రశంసలు అందుకోవడంతో పాటు పొలిటికల్ కెరీర్ పరంగా ఎదిగారు.  నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి  ప్రస్తుతం వైసీపీలోనే కొనసాగుతున్న సంగతి తెలిసిందే.




మరింత సమాచారం తెలుసుకోండి: