- పదవులు త్యాగం చేసి ప్రజల మనసు గెలిచి..
- ఐదు సార్లు ఎమ్మెల్యేగా  రికార్డ్..
 ప్రజా నాయకులకు పార్టీతో పనిలేదు..



ప్రజలతో మమేకమై ప్రజల మనసును చోరగొన్న నాయకులు ఏ పార్టీలో ఉన్నా కానీ ప్రజలు ఆదరిస్తారు. అలా ఆదరాభిమానాలు పొందిన నాయకుల్లో కొంతమంది మాత్రమే ఉంటారు. అలాంటి వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది జూపల్లి కృష్ణారావు. ఈయన ప్రజల మనిషి. ప్రజల కోసం ప్రజాసేవకై పరితపించే నాయకుడు అని చెప్పవచ్చు. అందుకే ప్రజలు ఈయనను ఐదు సార్లు అక్కున చేర్చుకొని అసెంబ్లీకి పంపించారు. అలాంటి జూపల్లి కృష్ణారావు ఇప్పటివరకు ఏ ఏ మంత్రి పదవులు చేపట్టారు. ఆ వివరాలు ఏంటో చూద్దాం.

 
 జూపల్లి రాజకీయం:
2023 తెలంగాణ ఎన్నికల్లో ఎక్కువగా చర్చ జరిగిన నియోజకవర్గం కొల్లాపూర్. కొల్లాపూర్ లో ఎవరు పోటీ చేసిన ఏ నాయకుడు వచ్చినా రెండు దశాబ్దాలుగా ఏలుతున్నది మాత్రం జూపల్లి కృష్ణారావు అని చెప్పవచ్చు. వరుసగా అయిదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై నలుగురు ముఖ్య మంత్రుల క్యాబినెట్లో మంత్రిగా పనిచేసిన ఘనత ఆయనది. ఇలా ఉమ్మడి పాలమూరు జిల్లాలో కీలక నాయకుడిగా ఎదిగారు జూపల్లి కృష్ణారావు. ఒకసారి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి రెండు సార్లు కాంగ్రెస్ నుంచి  రెండుసార్లు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004లో విమానం గుర్తునుంచి పోటీ చేసి  మొదటిసారి గెలుపొందారు జూపల్లి. మళ్లీ 2009లో కాంగ్రెస్ టికెట్ పై మరోసారి గెలుపొందారు. వైయస్సార్ క్యాబినెట్లో పౌరసరాఫరాల శాఖ మంత్రిగా చేశారు. ఆయన మరణం తర్వాత రోశయ్య మంత్రివర్గంలో కూడా మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 


ఇదే టైంలో తెలంగాణ ఉద్యమం తీవ్రమవుతోంది. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో ఆయనకు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇవ్వడంతో  జూపల్లి హర్ట్ అయిపోయారు. 2011 అక్టోబర్ 30వ తేదీన  తన మంత్రి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. మళ్లీ  2014లో తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. సీఎం కేసీఆర్ తొలి క్యాబినెట్లో  భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా  పనిచేశారు. 2018 ఎన్నికల్లో పోటీ చేసి జూపల్లి ఓడిపోయారు. 2023 ఏప్రిల్ 9న  ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం లో పాల్గొని, టిఆర్ఎస్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో బిఆర్ఎస్ పార్టీ వారిని సస్పెండ్ చేసింది. దీంతో జూపల్లి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 2023లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి జూపల్లి భారీ విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఆయన ఎక్సైజ్ శాఖ,పర్యాటక శాఖ,సంస్కృతి ఆర్కియాలజీ మంత్రిగా బాధ్యత తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: