ఏపీలో వైఎస్ జగన్ కేరాఫ్ అడ్రెస్ ఏదంటే అందరూ చటుక్కున ఇంకెక్కడ? తాడేపల్లి.. అని చెబుతూ ఉంటారు. అయితే ఇకనుండి అది పాత మాట అవుతుంది. అవును, ఆయన అసలు చిరునామా బెంగళూరు అన్న సంగతి అందరికీ తెలిసినదే. జగన్ తాజా ఎన్నికల్లో ఓటమి చెందిన తరువాత బెంగళూరు లోని తన ప్యాలెస్ కి మకాం మార్చేశారు. తాడేపల్లికి చుట్టపు చూపుగా మాత్రమే వచ్చి పోతున్నారు. ప్రస్తుతం ఉన్న తరుణంలో బెంగళూరులో అయితే తన రాజకీయ ఎత్తుగడలకు ఎలాంటి అవరోధాలు రావు అన్నదే జగన్ ఆలోచన. మరో వైపు చూస్తే జగన్ కి బెంగళూరు పూర్తి సేఫ్ జోన్ గా ఉంది అని కూడా వైసీపీ వర్గాలు అంటున్నాయి. అందుకే హైదరాబాద్ కంటే కూడా బెంగళూరునే ప్రిఫర్ చేస్తున్నారు.

విషయం ఏమిటంటే, బెంగళూరుకి, జగన్ కి ఎంతో అనుబంధం ఉంది. మూడు దశాబ్దాల పరిచయాలు ఉన్నాయి. పైగా అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంది. అందులో ఒక కీలక నేత, ట్రబుల్ షూటర్ తో కూడా జగన్ కి గట్టి బంధాలు ఉన్నాయి. అందుకే ఆయన అక్కడ మకాం చేసేందుకు ఇష్టపడుతున్నారు అని గుసగుసలు వినబడుతున్నాయి. ఇక బెంగళూరు లో జగన్ నివాసానికి తరచూ కాంగ్రెస్ నేతలు వస్తున్నారు అని ప్రచారం కూడా ఉంది. అంతేకాకుండా ఆయన అక్కడ ఎవరిని కలసినా కూడా అది సీక్రెట్ గా ఉంటుందనే అలా అక్కడికి వెళ్తున్నారు అని అంటున్నారు విమర్శకులు. బీజేపీ మీద విరక్తిని పెంచుకున్న జగన్ వైసీపీని కాంగ్రెస్ కి టచ్ లోకి తేవడానికే ఎంతో ప్రయత్నం చేస్తున్నారు అని అంటున్నారు కూడా.

ఇక దేశంలో కాంగ్రెస్ విస్తరిస్తున్న క్రమంలో ఇండియా కూటమిదే ఫ్యూచర్ అని భావిస్తున్న వైసీపీ అధినాయకత్వం ఆ దిశగానే అడుగులు వేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మరో వైపు వైసీపీకి జాతీయ స్థాయిలో ఇపుడు బలం కావాల్సిన అవసరం ఉంది. ఆ అండ కాంగ్రెస్ నుంచి ఇండియా కూటమి నుంచే వారికి ఎక్కువగా ఉందని భావిస్తున్నారు. అయితే ఈ ఆపరేషన్ సక్సెస్ కావాలి అంటే సీక్రెట్ ని ఎంత వీలు అయితే అంతలా మెయింటెయిన్ చేయాల్సిన అవసరం ఉందని కూడా వైసీపీ హై కమాండ్ భావించినట్టు తెలుస్తోంది. మొత్తానికి జగన్ నాలుగు రోజుల క్రితమే తాడేపల్లికి వచ్చారు. మళ్లీ బెంగళూరుకు పయనం అయ్యారని, ఇది లెక్క సరి చూస్తే తొమ్మిదవ సారి అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: