మన దేశ ప్రజలు చేసే వంటకాలలో కారానికి ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది. తెలుగు రాష్ట్రాలలో గుంటూరు మిర్చికి ఫేమస్ కాగా ఎండుమిర్చి సాగుకు భారీ స్థాయిలో ఖర్చవుతుంది. సాధారణంగా ఎండుమిర్చి సాగు చేయాలంటే అన్ని భూములలో సాగు చేయలేము. కేవలం బలమైన నేలల్లో మాత్రమే ఎండుమిర్చి సాగు సాధ్యమవుతుంది. అయితే గిట్టుబాటు ధర లేక రైతులకు ఎండుమిర్చి కన్నీళ్లను మిగుల్చుతోంది.
 
ప్రస్తుతం ఎండుమిర్చి ధరలు పరవాలేదనే స్థాయిలో ఉన్నా కొన్ని నెలల క్రితం మాత్రం మరీ దారుణంగా పతనమయ్యాయి. ఎండు మిర్చి మంచి ధర కేవలం 20 శాతం మంది రైతులకు మాత్రమే దక్కుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మార్కెట్లో ధరలు ఆశాజనకంగా ఉన్నాయని భావిస్తే పరిస్థితులు మరో విధంగా ఉన్నాయని రైతులు చెబుతుండటం గమనార్హం.
 
ఆరుగాలం పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వస్తోందని రైతులు చెబుతున్నారు. ఎకరాకు లక్ష రూపాయల పెట్టుబడి పెడితే ఆదాయం మాత్రం 50 వేల రూపాయలు మాత్రమే వస్తోందని వ్యాపారస్తులు ఏకమై రైతులను మోసగిస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. దిగుబడులు సైతం గతంతో పోలిస్తే తగ్గాయని ఎకరానికి మూడు క్వింటాళ్లు కూడా మిర్చి రావడం లేదని రైతులు వెల్లడిస్తున్నారు.
 
గుంటూరు మిర్చి రైతులను ఆదుకునేలా ఏపీ ప్రభుత్వం ఏమైనా చర్యలు చేపడుతుందేమో చూడాల్సి ఉంది. గుంటూరు రైతులకు మేలు జరిగేలా ప్రభుత్వం నుంచి ఏవైనా నిర్ణయాలు వెలువడితే బాగుంటుందని చెప్పవచ్చు. గుంటూరు మిర్చికి ప్రాంతాలతో సంబంధం లేకుండా మంచి పేరు ఉంది. రైతులను ప్రభుత్వం ఆదుకోకపోతే మాత్రం రాబోయే రోజుల్లో మిర్చి సాగు చేసే రైతుల సంఖ్య తగ్గే ఛాన్స్ ఉంది. చంద్రబాబు సర్కార్ మేనిఫెస్టోలో రైతుల కోసం ఎన్నో పథకాలను ప్రకటించినా వాటిలో అమలైన పథకాల సంఖ్య తక్కువ అనే సంగతి తెలిసిందే. రైతులకు సంబంధించిన పథకాలను ప్రభుత్వం వేగంగా అమలు చేయాల్సి ఉంది.




మరింత సమాచారం తెలుసుకోండి: