తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో విద్యుత్ ఛార్జీలు పెరగనున్నాయా అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలను సవరించాలని ప్రతిపాదనలు చేయడం గమనార్హం. 2024 - 2025 సంవత్సరాలకు సంబంధించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదికను నిన్న రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలికి సమర్పించడం జరిగింది.
 
మొత్తం మూడు కేటగిరీలలో ఛార్జీలను సవరించాలని ప్రతిపాదనలు చేశారని సమాచారం అందుతోంది. ఈ ప్రతిపాదనలను ఈఆర్సీ ఆమోదిస్తే లోటును పూడ్చుకోవడానికి ఏకంగా 1200 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం అయితే ఉందని డిస్కంలు చెబుతున్నాయి. ఈ ప్రతిపాదనల విషయంలో రాష్ట్రంలో మూడు చోట్ల ప్రజల సమక్షంలో బహిరంగ విచారణ వేసిన అనంతరం ఈఆర్సీ తుది తీర్పు ఇవ్వనుంది.
 
రాష్ట్రంలోని ఉత్తర, దక్షిణ డిస్కంలు తమ ఆదాయ, వ్యయాల మధ్య లోటు 14,222 కోట్ల రూపాయలుగా ఉండొచ్చని అంచనా వేయడం గమనార్హం. ఈ మొత్తంలో 13022 కోట్ల రూపాయలను ప్రభుత్వం బడ్జెట్ ద్వారా సమకూర్చాలని కోరడం కొసమెరుపు. గృహ వినియోగదారులకు నెలకు 300 యూనిట్లు దాటితే కిలో వాట్ కు స్థిర ఛార్జీ 10 రూపాయలుగా ఉండగా దానిని 50 రూపాయలకు పెంచడానికి అనుమతులు ఇవ్వాలని డిస్కంలు కోరాయి.
 
హెచ్.టీ పరిశ్రమల జనరల్ కేటగిరీలో మూడు రకాల కనెక్షన్లు ఉండగా 11 కేవీ సామర్థ్యంతో కనెక్షన్ తీసుకున్న పరిశ్రమ వినియోగించుకున్న కరెంట్ కు యూనిట్ కు 7.65 రూపాయలు వసూలు చేస్తున్నారు. 33 కేవీ సామర్థ్యానికి, 132 కేవీ సామర్థ్యానికి లెక్కలు మరో విధంగా ఉన్నాయి. ఇకపై పరిశ్రమల నుంచి యూనిట్ కు 7.65 రూపాయలు చొప్పునే వసూలు చేయనున్నారని తెలుస్తోంది. విద్యుత్ ఛార్జీలు పెరిగినా పరిశ్రమలపై భారం పెరిగిన స్థాయిలో ప్రజలపై భారం పడే అవకాశాలు అయితే లేవని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: