ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో మాజీ సీఎం జగన్ చేపట్టిన పథకాల పేర్లను మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పలు పథకాలు పేర్లు మారాయి.ఏపీలో టీడీపీ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. దీంతో గత పాలనలోని సంక్షేమ పథకాలపై ఫోకస్ పెట్టింది. మాజీ సీఎం జగన్ పేరుతో ఉన్న పథకాల పేర్లను మార్చింది ప్రస్తుత ప్రభుత్వం. వైఎస్సార్ కల్యాణ మస్తు పథకానికి చంద్రన్న పెళ్లి కానుక, జగనన్న విద్యా దీవెన పథకానికి పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్, జగనన్న వసతి దీవెన ఇకపై పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్, జగనన్న విదేశీ దీవెన పథకానికి అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి, వైఎస్సార్ విద్యోన్నతి పథకానికి ఎన్టీఆర్ విద్యోన్నతి. జగనన్న సివిల్ సర్వీసెస్ పథకానికి ఇన్సెంటివ్ ఫర్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అని పేర్లు మారుస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది.ఈ నేపథ్యంలోనే రెండురోజుల క్రితం జ‌గ‌న్ స‌ర్కార్ అమ‌లు చేసిన 'శాశ్వ‌త భూ హ‌క్కు-భూ ర‌క్ష‌ణ' ప‌థ‌కం పేరును 'ఏపీ రీ స‌ర్వే ప్రాజెక్టు'గా మార్పు చేస్తూ నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు తాజాగా రెవెన్యూ శాఖ ఉత్త‌ర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.కాగా, ఈ స్కీమ్ ను గ్రామాల్లో భూవివాదాలు, త‌గాదాలు లేకుండా చేయాల‌నే ఉద్దేశంతో తీసుకువ‌చ్చామని అప్పట్లో జగన్ ప్రభుత్వం పేర్కొంది.

దీనిలో భాగంగా భూముల స‌మ‌గ్ర రీ స‌ర్వే చేప‌ట్టారు. కానీ, ఈ ప‌థ‌కం ఆచ‌ర‌ణ‌లోకి వ‌చ్చేస‌రికి భారీ ఎత్తున అవ‌క‌త‌వ‌క‌లు చోటు చేసుకున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో బాధితులు 'శాశ్వ‌త భూ హ‌క్కు-భూ ర‌క్ష‌ణ' ప‌థ‌కంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ నేప‌థ్యంలో, ఈ స్కీమ్ అమలు తీరును అప్ప‌టి ప్ర‌తిప‌క్షం టీడీపీ తీవ్రంగా ఖండించింది. తాము అధికారంలోకి వ‌స్తే ఈ స్కీమ్‌ను పూర్తిగా ప్ర‌క్షాళ‌న చేయ‌డం జ‌రుగుతుంద‌ని పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు అన్నారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి రావ‌డంతో 'శాశ్వ‌త భూ హ‌క్కు-భూ ర‌క్ష‌ణ ప‌థ‌కం' పేరును మారుస్తూ ఉత్త‌ర్వులు జారీ అయ్యాయి.ఇదిలావుండగా తాజాగా మరో స్కీమ్‌ పేరు మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.'వైఎస్సార్ లా నేస్తం' పథకం పేరును 'న్యాయమిత్ర'గా మారుస్తూ న్యాయశాఖ కార్యదర్శి సునీత జీవో జారీ చేశారు.ఈ స్కీమ్‌ కొత్త మార్గదర్శకాలను త్వరలోనే జారీ చేస్తామని సునీత తెలిపారు. కాగా యువ న్యాయవాదులకు ఆర్థిక ప్రోత్సాహం అందించేందుకు గత వైసీపీ ప్రభుత్వం వైఎస్సార్‌ లా నేస్తం స్కీమ్‌ను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.ఈ పథకం కింద లా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన యువ న్యాయవాదులకు గత ప్రభుత్వం నెలకు రూ.5 వేల స్టైఫండ్ అందించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: