మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీకి ఊహించని షాకిచ్చిన సంగతి తెలిసిందే. ఒంగోలులో పవన్ సమక్షంలో జనసేనలో చేరతానని బాలినేని వెల్లడించారు. బాలినేని మాట్లాడుతూ వైఎస్సార్ నాకు రాజకీయ భిక్ష పెట్టారని వైఎస్సార్ ఫ్యామిలీ అంటే నాకు ఎంతో గౌరవం అని అన్నారు. అందువల్లే నాడు జగన్ కోసం రాజీనామా చేయడం జరిగిందని బాలినేని కామెంట్లు చేశారు. జగన్ వెంట నడిచామని పేర్కొన్నారు.  
 
వైఎస్సార్ పై గౌరవంతో జగన్ ను ఇంతలా భరించానని కొన్నిరోజులు ఏడ్చానని కళ్లల్లో నీళ్లు సైతం ఇంకిపోయాయని తెలిపారు. ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయినా జగన్ లో మార్పు రాలేదని జగన్ పాలన గురించి వాస్తవాలు ఆయనకు చెబితే నేను నెగిటివ్ గా చెబుతున్నానని ఆయన భావించేవారని బాలినేని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రజల అభిప్రాయాలు జగన్ కు చెప్పినా ఆయనకు నచ్చేవి కావని ఆయన అన్నారు.
 
జనసేనలో చేరతానని అడిగిన వెంటనే పవన్ అంగీకరించారని బాలినేని తెలిపారు. ఒంగోలు వచ్చి పార్టీలో చేర్చుకుంటానని పవన్ అన్నారని ఆయన పేర్కొన్నారు. పార్టీలో చేరే తేదీ గురించి త్వరలో నిర్ణయం తీసుకుని పవన్ కు సమాచారం ఇస్తామని బాలినేని తెలిపారు. జగన్ నుంచి నేనేం ఆశించలేదని పాలిటిక్స్ లో ఉండి నేనే తీవ్రస్థాయిలో నష్టపోయానని ఆయన వెల్లడించారు.
 
జగన్ ను డబ్బుల కొరకు నేన్ బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోందని పొలిటికల్ గా నాకు చాలా అన్యాయం జరిగిందని అయితే వైసీపీని వీడాను కాబట్టి ప్రస్తుతం ఆ విషయాలను చెప్పడం సరికాదని బాలినేని పేర్కొన్నారు. బాలినేని చేసిన కామెంట్లతో జగన్ కు ఇప్పటికైనా జ్ఞానోదయం అవుతుందేమో చూడాల్సి ఉంది. జగన్ లో మార్పు రాకపోతే వైసీపీకి భవిష్యత్తు ఉండదనే చర్చ సైతం జరుగుతోంది. జగన్ అందరినీ దూరం చేసుకుంటూ పాలిటిక్స్ లో ఒంటరి అవుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.




మరింత సమాచారం తెలుసుకోండి: