ఆంధ్రప్రదేశ్‌ తాజా రాజకీయం అంతా తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశుడి లడ్డు ప్రసాదం చుట్టూనే తురుగుతోందనే విషయం అందరికీ తెలిసిన విషయమే. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదం అపవిత్రం అయిందని సీఎం చంద్రబాబు ఆరోపణలు చేసిన నేపథ్యంలో చెలరేగిన వివాదం నేటికీ కొనసాగుతోంది. ప్రసాదం లడ్డు తయారీలో జంతువుల నూనెలు, ఫిష్‌ ఆయిల్, పంది కొవ్వు కలిపారనే ఆరోపణలు ఇపుడు దేశ వ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్నాయి. దాంతో ఈ అంశం ఒకవైపు అధికార కూటమి నేతల మధ్య, ఇటు వైసీపీ నేతల మధ్య తీవ్ర వాగ్వాదానికి దారితీస్తోంది. ఈ నేపథ్యంలో దీనిపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ విచారణకు ఆదేశించిన సంగతి కూడా విదితమే.

కాగా తిరుమల లడ్డూ వివాదంపై ప్రముఖ సినీ నటుడు సుమన్‌ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేయడం కొసమెరుపు. ఒకవేళ, లడ్డూ కల్తీ జరగడం అనేది నిజమని తేలితే బాధ్యులను కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా డిమాండ్‌ చేశారు. అంతేకాకుండా, ఉగ్రవాదుల తరహాలో బాధ్యులను దారుణంగా శిక్షించాలని కోరడం జరిగింది. దాంతో ఈ వ్యాఖ్యలు అటు మీడియాలోనూ, ఇటు సోషల్ మీడియాలోనూ పెను దుమారం రేపుతున్నాయి. ఇంకా నటుడు సుమన్ మాట్లాడుతూ... ఈ ఘటనతో దేశ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని కూడా ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ సందర్భగా ఇంకా ఆయన మాట్లాడుతూ... "అన్ని మతాలకు సంబంధించి, ప్రార్థనా మందిరాలు ఇక్కడ ఉన్నాయి. అన్ని చోట్ల ప్రసాదాలు చేస్తుంటారు. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిస్తే అక్కడ ఉన్న అధికారుల బోర్డు ఇంతవరకు ఏం చేస్తోంది? సీఎం చెప్పేవరకు వారికి తెలియదా? నెయ్యి నాణ్యతను తనిఖీ చేసే పద్ధతి ఉంటుందని.. మరి ట్యాంకర్‌ నుంచి కల్తీ నెయ్యి ఎలా పాస్‌ అయ్యిందో? ఈ అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. తప్పు చేసినవారిని ఉగ్రవాదులను శిక్షించినట్టు శిక్షించాలి. అనుమానం ఒక్కసారి వచ్చాక అది అందరి మీదకు పోతుంది. ఒక ఆఫీసులో ఒకరు తప్పు చేస్తే అందరికీ చెడ్డపేరు వస్తుంది. ఇక్కడ కూడా అలాంటిదే జరిగింది. దోషులను అస్సలు వదలవద్దు!" అని అన్నారు. దాంతో ఈ వ్యాఖ్యలను ఓ వర్గం సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్ చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: