తిరుపతి లడ్డూ వివాదంపై సుప్రీం కోర్టు సోమవారం 30 సెప్టెంబర్ నాడు కీలకమైన వ్యాఖ్యలుచేసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దేవుళ్ళను రాజకీయాలకు దూరంగా ఉంచాలని సూచించింది.వైఎస్సార్సీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో జంతు కొవ్వు ఉపయోగించారని అనడానికి ఆధారాలు ఎక్కడ అని ప్రశ్నించింది.తిరుపతి లడ్డూలో జంతు కొవ్వు కలిసిందనే ఆరోపణలపై ఏపీలోన చంద్రబాబునాయుడు ప్రభుత్వం సెప్టెంబర్ 26న సిట్ ఏర్పాటు చేసింది. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ సెప్టెబర్ 25న దాఖలైంది. కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సెప్టెంబర్ 18న ఎలాంటి ఆధారాలు లేకుండా తిరుపతి ప్రసాదం కలుషితమైందని మీడియాకు ఎలా చెబుతారు?ముఖ్యమంత్రిగా రాజ్యాంగబద్ధమైన ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి ఒక అంశంపై విచారణ జరుగుతున్న సమయంలో వ్యాఖ్యలు చేయడం సరైన పని కాదు. కోట్లాది మంది ప్రజల సెంటిమెంటుతో ముడిపడి ఉన్న అంశంపై ఆయన బాహాటంగా మాట్లాడి ఉండకూడదు.ప్రజలకు అందుబాటులోకి వచ్చిన నివేదికలు తిరుపతి ప్రసాదంలో జంతు కొవ్వు ఉపయోగించినట్లు ఏమీ సూచించడం లేదని జస్టిస్ విశ్వనాథన్ అన్నారు. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం ప్రసాదం తయారీకి వాడిన నెయ్యి కలుషితమైందని చెప్పడానికి ఎలాంటి ఆధారం లేదు.

పరీక్షలకు పంపిన నెయ్యి శాంపిల్, ప్రసాదం తయారీకి ఉపయోగించిన నెయ్యిదేనా అని జస్టిస్ గవాయి ప్రశ్నించారు. ఏపీ తరఫున వాదన వినిపించిన సీనియర్ అడ్వొకేట్ ముకుల్ రోహత్గీని ఉద్దేశిస్తూ, 'ప్రభుత్వం దేవుళ్ళను రాజకీయాలకు దూరంగా ఉంచాలి' అని అన్నారు.కేసును సుప్రీం కోర్టు మళ్ళీ అక్టోబర్ 3న విచారిస్తుందని, అప్పటివరకు సిట్ ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సుప్రీం కోర్టు ఆదేశించింది. అసలు సిట్‌ విచారణను కొనసాగించాలా వద్దా అనే విషయాన్ని పరిశీలించాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను సుప్రీం కోర్టు కోరింది. సిట్ కాకుండా స్వతంత్ర కేంద్ర సంస్థతో విచారణ జరిపించడం మంచిదా అన్నది కూడా చెప్పాలని అడిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణను చూసుకునే టీటీడీ బోర్డు సీఈఓ, లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగిందనే ఆరోపణలను సవివరంగా తోసిపుచ్చినట్లు పత్రికల్లో వచ్చిన వార్తలను సుప్రీం కోర్టు ప్రస్తావించింది.ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని చంద్రబాబు సర్కారుకు ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. కనీసం దేవుడినైనా రాజకీయాలకు దూరంగా ఉంచాలంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం పరోక్షంగా బాబు సర్కారుకు చురకలు అంటించినట్టయింది. అంతే కాదు దర్యాప్తు కూడా నిష్పక్షపాతంగా జరగదేమో అని అనుమానాన్ని సుప్రీంకోర్టు వ్యక్తం చేసిందంటే ఏపీ ప్రభుత్వం పై కోర్టుకు అస్సలు నమ్మకం లేదనే విషయం తెలుస్తుంది. తిరుమల లడ్డులో కల్తీ నెయ్యి కలిపారు అనే వివాదాన్ని చంద్రబాబు సర్కారు కావాలనే లేవనెత్తిందని డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఆరోపణలు చేస్తుందని వైసీపీ చెబుతూ వస్తుంది. తాజాగా సుప్రీం చేసిన కామెంట్స్ వైసీపీ వాదనలకు మరింత బలం చేకూర్చాయి. కేవలం ప్రజలను పక్కదారి పట్టించేందుకు మాత్రమే ఈ వివాదాన్ని టిడిపి రగిల్చినట్లు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: