కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పూర్తిస్థాయి బడ్జెట్‌ను వచ్చే నెలలో ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి.. మొత్తం రూ. 2.90 లక్షల కోట్ల రూపాయలతో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్  అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు అవసరమైన కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఆర్థిక శాఖ అధికారులు అంతా బడ్జెట్ రూపకల్పనలో నిమగ్నమై ఉన్నారు. అలాగే బడ్జెట్ సమావేశాల తేదీలను కూడా ఖరారు చేసే పనిలో ఉన్నారని అంటున్నారు. దీని కోసం మంత్రి పయ్యావుల కేశవ్  ఇప్పటికే అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడుతో సమావేశమయ్యారని తెలుస్తుంది.


ఎన్నికల దృష్ట్యా గత వైసిపి ప్రభుత్వం ఫిబ్రవరిలో ఓటాన్‌ అకౌంటు బడ్జెట్ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. 2024 ఏప్రిల్ నుంచి జూలై 31 వరకు నాలుగు నెలల కాలానికి 40 గ్రాండ్ల మీద రూ.1,09052.34 కోట్లకు శాసనసభ ఆమోదం తెలిపింది. ఇక జూన్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జూలైలో పూర్తిస్థాయి బడ్జెట్ సమర్పించాల్సి ఉంది. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకపోవడం కారణంగా అప్పుల అంశాలపై స్పష్టత లేకపోవడం కారణంగా మరోసారి ఓటాన్ ఎకౌంట్ రూపంలో ఆర్డినెన్స్ తీసుకు వచ్చిన విషయం తెలిసిందే.


ఆగస్టు నుంచి నవంబర్ వరకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుల కోసం రూ. 1,29,972.97 కోట్లతో 40 గ్రాండ్ల కింద రెండో తాత్కాలిక బడ్జెట్ కు గవర్నర్ ఆమోదం తీసుకుంది. ఇలా 8 నెలల కోసం ఓటన్ ఎకౌంట్ పద్ధతిని ఉపయోగించారు. ఈ క్రమంలోనే నవంబర్‌లో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు చంద్రబాబు సర్కార్ సిద్ధమవుతుంది. ఈ బడ్జెట్‌లో సంక్షేమానికి , అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇచ్చే విధంగా కసరత్తు జరుగుతున్నట్లు రాజకీయ వర్గాల నుంచి అందుతున్న‌ సమాచారం. ముఖ్యంగా అమరావతి , పోలవరం ప్రాజెక్టులకు నిధులు: ఈ బడ్జెట్‌లో ముఖ్యంగా అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్ట్‌కు పెద్దపీట వేయనున్నారు. అలాగే రాజధాని అమరావతిలో మౌలిక సదుపాయాల నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి భారీగా నిధులు కేటాయించే అవకాశాలు ఉన్నాయి . అలాగే రహదారుల నిర్మాణం , మరమ్మతుల కోసం సముచిత కేటాయింపులు ఉంటాయని కూడా అంటున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: