దశాబ్దకాలం పాటు తనకంటూ తిరుగులేని నేతగా కేసీఆర్ తెలంగాణ రాజకీయాలను శాసించాడు. గులాబీ పార్టీ పురుడు పోసుకున్నప్పటి నుంచి ఆయనే అధినేతగా కొనసాగుతూ వస్తున్నారు. ఓవరాల్‌గా పార్టీకి బాస్‌ ఆయనే. ఉద్యమ కాలం నుంచి పార్టీకి ఏ స్థాయిలో ఊపు తీసుకురావాలో ఆ స్థాయిలో తీసుకొచ్చాడు కేసీఆర్.  ఒకవిధంగా రాష్ట్రంలోనే కాకుండా దేశ రాజకీయాల్లోనూ తనదైన ముద్ర చూపించారు.


అనూహ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కొలువుదీరింది. దాంతో పది నెలలుగా కేసీఆర్ ప్రజల్లోకి రావడం లేదు. కేవలం ఫాంహౌజ్ నుంచే నేతలను కలుస్తూ వారికి దిశానిర్దేశం చేస్తూ వస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై నిత్యం తెలుసుకుంటూ ఉన్నారు. ప్రజాసమస్యలపై పోరాడాలని, కాంగ్రెస్ వైఫల్యాలను నిలదీయాలని వారికి సూచనలు చేస్తూనే ఉన్నారు.


అయితే.. గత పది నెలలుగా ఆయన ఎప్పుడెప్పుడా ప్రజల్లోకి వస్తారా అని చూస్తున్నారు. కానీ.. ఆయన నుంచి మాత్రం ఎలాంటి స్టేట్‌మెంట్లు రావడంలేదు. కనీసం వరదల సమయంలోనూ ఆయన నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. మరోవైపు.. హైడ్రా, గ్రూప్1 వివాదాలు నడుస్తున్నా హరీశ్, కేటీఆర్ పోరాడుతున్నారే తప్పితే కేసీఆర్ ఎలాంటి భరోసా కల్పించలేదు.


ప్రస్తుతం రాష్ట్రంలో మూసీపైనే రాజకీయం కొనసాగుతోంది. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా పాలిటిక్స్ నడుస్తున్నాయి.  ఎవరికి వారుగా మూసీ మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇస్తూ రెచ్చిపోతున్నారు.  మూసీపై కేటీఆర్ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.  అయితే.. స్క్రీన్‌లో బీఆర్ఎస్ లోగో, కేటీఆర్ ఫొటో తప్పితే కేసీఆర్ ఫొటో ఎక్కడా కనిపించలేదు. దీంతో అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది.  పార్టీని పూర్తిగా కేటీఆర్ లాగేసుకున్నారన్న టాక్ నడిచింది.


కేసీఆర్ పూర్తిగా రాజకీయాలకు విరామం ప్రకటించారన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు.. బీఆర్ఎస్ నేతలు మాత్రం త్వరలో కేసీఆర్ ప్రజల్లోకి రాబోతున్నారంటూ ప్రచారాలు సాగిస్తున్నారు.  దసరా ముహూర్తం అంటూ ప్రచారం చేశారు. ఆ దసరా కూడా అయిపోయింది. కానీ కేసీఆర్ నుంచి మాత్రం ఎలాంటి స్టేట్ మెంట్ లేదు.  పార్టీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మాత్రం కేసీఆర్ ఇక పార్టీలో యాక్టివ్ రోల్‌లోకి రాకపోవచ్చన్న అనుమానాలు వస్తున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: