కేంద్రంలో ఎన్డీయే కూటమి ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రిలీజ్ చేసిన బడ్జెట్ కావడంతో సర్వత్రా చర్చకు దారితీసింది. అయితే అందరి ఊహలను అందుకున్నట్టే కనబడుతోంది తాజా బడ్జెట్. అవును... ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ తాజాగా పూర్తి స్థాయి తొలి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా బిహార్‌ పై వరాల జల్లులు కురిపించారు. దాంతో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లనున్న ఆ రాష్ట్రానికి వార్షిక పద్దులో ప్రత్యేక స్థానం దక్కినట్టు కనబడుతోందని విశ్లేషకులు అంటున్నారు.

బిహార్‌లో మఖానా బోర్డు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలపడంతో సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. మఖానా వ్యాపారం కోసం రైతుల సౌకర్యార్థం ఈ బోర్డు పని చేయనుంది. ‘‘బిహార్‌లో ఏర్పాటు చేయబోతున్న మఖానా బోర్డు ద్వారా వాటి ఉత్పత్తి, ప్రాసెసింగ్, మార్కెటింగ్ అవకాశాలు మెండుగా మెరుగు పడనున్నాయి. దీని కింద రైతులకు శిక్షణ అందనుంది. వారు అన్ని ప్రభుత్వ పథకాల నుంచి ప్రయోజనం పొందేలా బోర్డ్‌ చూస్తుంది!’’ అంటూ మంత్రి వెల్లడించారు. ఇకపోతే బిహార్‌లోని మిథిలాంచల్ ప్రాంతంలో 50,000 హెక్టార్లకు ప్రయోజనం చేకూర్చే వెస్టర్న్ కోసి కెనాల్‌కు ఆర్థిక సాయం అందించనుంది కేంద్రం. అంతేకాకుండా ఐఐటీ పట్నా సామర్థ్యాన్ని మరింత పెంచనుంది. పదేళ్లలో 4 కోట్ల మందికి విమాన ప్రయాణం కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్న కేంద్రం ఆ దిశగా బిహార్‌లో గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్ట్‌ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్టు చాలా స్పష్టంగా కనబడుతోంది.

అంతే కాకుండా బిహార్‌లో నేషనల్ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ అండ్ మేనేజ్‌మెంట్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. కాగా బిహార్‌లో ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ పార్టీ జేడీయూతో కలిసి భాజపా అధికారంలో ఉంది. ఆ జేడీయూ కేంద్రంలోని ఎన్డీయేలో కీలక భాగస్వామి. బిహార్‌కు ప్రత్యేక హోదా సాధ్యం కాదని తేల్చి చెప్పిన కేంద్రం.. ఎన్నికల ముందు ఇలా వరాల జల్లు కురిపించడం పట్ల విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: