ఓ మంత్రి కారణంగా.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబావుట ఎగురవేస్తున్నారట పదిమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. ఇక దీనికి సంబంధించిన న్యూస్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో రావడంతో.. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కసారి ఉలిక్కిపడింది. తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యవహార శైలి నచ్చక మొత్తం 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశం నిర్వహించారట.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలర్ట్ అయినట్టు తెలుస్తోంది. ఇందులో... మంత్రులతో అత్యవసర సమావేశం నిర్వహించారు రేవంత్ రెడ్డి. రహస్యంగా సమావేశం అయిన 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై మండిపడ్డారట సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఫాంహౌజ్లో భేటీ అయిన 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో నాయిని రాజేందర్ రెడ్డితో పాటు... భూపతి రెడ్డి ఉన్నట్లు చెబుతున్నారు. యెన్నం శ్రీనివాస్ రెడ్డి, మురళీ నాయక్, కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, సంజీవ్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి, లక్ష్మీకాంత్, దొంతి మాధవ్, బీర్ల ఐలయ్య తది తరులు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
అయితే.. మంత్రి పొంగులేటిపై ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్న కారణంగానే ఈ రహస్య సమావేశం జరిగిందని అంటున్నారు. దీంతో... పాలేరు పర్యటనను రద్దు చేసుకొని మరీ రేవంత్ నిర్వహించిన సమావేశానికి హాజరు అయ్యారట మంత్రి పొంగులేటి. ఇక అధికారులు ఎవరూ సమావేశానికి రావద్దని రేవంత్ రెడ్డి ఆదేశించారట. స్థానిక సంస్థలు, ఎమ్మెల్సీ ఎన్నికల ముందు ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తే ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళతాయని అధిష్టానం ఆందోళన చెందుతోందట.