అవును.. మీరు విన్నది నిజమే. పాకిస్థాన్ చాలా విచిత్రంగా మరోమారు శాంతి అనే మాట వచ్చింది. కశ్మీర్‌ సహా అన్ని సమస్యలను భారత్‌తో సంప్రదింపుల ద్వారానే పరిష్కరించుకోవాలని చూస్తున్నట్టు తెలిపింది. అయితే, ఐరాసకు చేసిన వాగ్దానాలను నెరవేర్చి, చర్చలకు భారత్‌ ముందుకు రావాలంటూ ఈ సందర్భంగా సన్నాయి నొక్కులు నొక్కడం కొసమెరుపు. విషయం ఏమిటంటే? ‘కశ్మీర్‌ సంఘీభావ దినం’ సందర్భంగా ముజఫరాబాద్‌లోని పీవోకే అసెంబ్లీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశాల్లో పాకిస్థాన్‌ ప్రధాని షహబాజ్‌ షరీఫ్‌ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా షహబాజ్‌ షరీఫ్‌ మాట్లాడుతూ.. 2019 ఆగస్టు 5 నాటి ఆలోచన నుంచి భారత్‌ ఎంత తొందరగా బయటకు వస్తే అంత మంచిదని, ఐరాసకు చేసిన వాగ్దానం నెరవేర్చడం కోసం త్వరలో చర్చలు జరపాలని సూచించారు. మరీ ముఖ్యంగా 'ఆర్టికల్‌ 370 రద్దు'ను గురించి ఆయన పరోక్షంగా ప్రస్తావించడంతో భారత రాజకీయ పండితులు దానిని స్వీట్ వార్నింగ్ లాగా పరిగణిస్తున్నారు. అక్కడితో ఆగకుండా జమ్మూ కశ్మీర్‌, లద్దాఖ్‌లు అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ తమ దేశంలో అంతర్భాగమని చెప్పడం. అయితే భారత్‌ కూడా పదే పదే ఇదే చెబుతోంది. అంతేకాకుండా ఉగ్రవాదం, హింసలేని వాతావరణంలోనే పొరుగుదేశం పాకిస్థాన్‌తో చర్చలు కోరుకుంటున్నామని స్పష్టం చేస్తోంది. అయినా POK (పాక్ ఆక్రమిత కాశ్మీర్) పైన వారి ఆగడాలు ఆగడంలేదు. ఈ క్రమంలోనే షహబాజ్‌ షరీఫ్‌ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారాన్నే రేపుతున్నాయి.

ఇకపోతే 75 సంవత్సరాల వయస్సు గల మియాన్ ముహమ్మద్ షెహబాజ్ షరీఫ్ 23 సెప్టెంబర్ 1951న పాకిస్థాన్ లో జన్మించారు. ఆయన ఒక పాకిస్తానీ రాజకీయ నాయకుడు మరియు వ్యాపారవేత్త. అతను మార్చి 2024 నుండి పాకిస్తాన్ ప్రధాన మంత్రిగా పని చేయడం జరిగింది. గతంలో చూసుకుంటే... ఏప్రిల్ 2022 నుండి ఆగస్టు 2023 వరకు ప్రధాన మంత్రిగా పని చేశాడు. అతను పాకిస్తాన్ ముస్లిం లీగ్ (PML-N) అధ్యక్షుడిగా కూడా పని చేయడం గమనార్హం. అంతేకాకుండా గతంలో ఆయన పంజాబ్ ముఖ్య మంత్రిగా కూడా పనిచేసారు. ఏకంగా 3 సార్లు పంజాబ్ లో ఆయన పనిచేశాడు. దాంతో పంజాబ్‌కు ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసినవారి లిస్టులో చేరిపోయాడు. కాగా ఆయన చేసిన తాజా వ్యాఖ్యలకు చాలామంది ఘాటుగా స్పందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: