![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/politics/politics_latestnews/ap-schools-closingb43bb780-d1d2-469c-aaef-ec8390cb79bb-415x250.jpg)
జగన్ ప్రభుత్వం హయాంలో విద్యా సంస్కరణలు ఒకవైపు, చంద్రబాబు హయాంలో స్కూళ్ల మూత మరోవైపు అన్న చందంగా తయారైంది పరిస్థితి. "నాడు-నేడు" పథకం కింద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి స్కూళ్లకు కొత్త రంగులు వేసి, హంగులు అద్దారు. కానీ, ఇప్పుడు చూస్తే బాబు సర్కార్ పూర్తి రివర్స్లో వెళ్తోంది. కృష్ణా జిల్లానే తీసుకుంటే చాలు, చల్లపల్లి మండలం రామానగర్లో "నాడు-నేడు" కింద సర్వాంగ సుందరంగా ముస్తాబైన ప్రాథమిక పాఠశాల త్వరలోనే మూతపడబోతోందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కేవలం ఆ ఒక్క స్కూలే కాదు.. చల్లపల్లి మండలంలోనే దాదాపు 15 స్కూళ్లు, కృష్ణా జిల్లా వ్యాప్తంగా వందల సంఖ్యలో స్కూళ్లు మూతపడేందుకు సిద్ధంగా ఉన్నాయి.
నిన్నటి వరకు ప్రతిపక్షంలో ఉండి, జగన్ సర్కార్ విద్యా విధానాలను దుయ్యబట్టిన నారా లోకేష్, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఇలాంటి పనులను కొనసాగించడం చాలా మందికి మింగుడు పడటం లేదట. జగన్ హయాంలో స్కూళ్లు మూసేస్తున్నారని పాదయాత్రలో ఊరూరా గోల చేసిన లోకేష్కు ఇప్పుడు ఏం చేయాలో పాలుపోవడం లేదు. అప్పట్లో విమర్శించిన నోటితోనే ఇప్పుడు సమర్థించుకోలేక, మార్పులు చేస్తూ కాలం గడుపుతున్నారు. అసలు లోకేష్ విమర్శించింది స్కూళ్ల మూతను గురించా?లేక మూసింది వేరే వాళ్లు కాబట్టా? అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో హాట్ డిస్కషన్గా మారాయి.
మరోవైపు, సాక్షి మీడియా ఈ అంశాన్ని బాగా హైలైట్ చేస్తూ, ప్రభుత్వంపై రివర్స్ ఎటాక్ మొదలుపెట్టింది. "విలీనం కిరికిరి.. బడులకు ఊరే ఊరే మరి" అంటూ కథనాలు వండి వారుస్తోంది. ఒకప్పుడు ప్రతిపక్షం చేసిన విమర్శలను ఇప్పుడు అధికార పక్షంపైనే తిప్పికొడుతూ, ప్రజల్లో గందరగోళం సృష్టిస్తోంది. మొత్తానికి, "నాడు-నేడు" పేరుతో స్కూళ్లను బాగు చేశారో లేదో కానీ, వేల సంఖ్యలో స్కూళ్లను మూసివేస్తూ మాత్రం రికార్డు సృష్టిస్తున్నారు. చివరికి ఈ విద్యా సంస్కరణలు ఎవరి కోసం? విద్యార్థుల కోసమా? లేక రాజకీయాల కోసమా? అనేది తేలాల్సి ఉంది.