గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని విజయవాడ పటమట పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. అక్కడ నుంచి వంశీని పోలీసులు విజయవాడకు తరలించినట్టు సమాచారం. ఈ క్రమంలో వంశీపై ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ కేసు.. కిడ్నాప్‌, హత్యాయత్నం, బెదిరింపు కేసులు కింద సెక్షన్‌ 140(1), 308, 351(3), రెడ్‌ విత్‌ 3(5) కింద కేసులు నమోదు అయ్యాయి. అటు వంశీపై కిడ్నాప్, దాడి, ఎస్సీ, ఎస్టీ అట్టాసిటీ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తున్నట్లు ఆయన భార్యకు పటమట పోలీసులు నోటీస్ ఇచ్చారు. ఈ క్రమంలో గన్నవరంలో వంశీ సన్నిహితులు గరంగరంగా ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఇకపోతే, గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో కొద్దిరోజుల కిందట ఊహించని మలుపు చోటు చేసుకుంది. గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడి జరిగిందని ఫిర్యాదు చేసిన సత్యవర్థన్‌ తనకుతానుగా కేసు వెనక్కు తీసుకుంటున్నట్లు అఫిడవిట్ దాఖలు చేయగా కలకలం చెలరేగింది. సత్యవర్థన్‌ను బెదిరించడం వల్లే కేసు విత్‌డ్రా చేసుకున్నట్టు ఆరోపణలు వినిపించాయి. ఈ కేసులో కోర్టులో విచారణ జరగబోతోంది. ఇదిలా ఉంటే.. ఇటు హైదరాబాద్‌లో వంశీని అదుపులోకి తీసుకోవడం సంచలనంగా మారింది. సత్యవర్థన్‌ కిడ్నాప్‌ కేసులోనే ఇప్పుడు వల్లభనేని వంశీ అరెస్ట్ అయినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఇక ఈ అరెస్ట్‌ను మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు చాలా తీవ్రంగా ఖండించారు. ఇది అక్రమ కేసు అని, దీనిపై పోరాటం చేస్తామని ఆరోపించారు. ఈ నేపథ్యంలో తన బృందం కలిసి డీజీపీ కార్యాయంలో ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నం చేయగా అధికారులు అందుబాటులో లేకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అంబటి మీడియాతో మాట్లాడుతూ ‘‘2022లో టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన కేసులో సత్యవర్ధన్ అనే వ్యక్తి ఫిర్యాదు చేసి, మరలా ఆయనే మేజిస్ట్రేట్‌ ముందు అది పోలీసులు బలవంతంగా ఇప్పించిన ఫిర్యాదు అని చెప్పారు. టీడీపీ ప్రభుత్వం దొంగ కేసు పెట్టించిన విషయం బయటకు రావడంతో మళ్లీ సత్యవర్ధన్ కుటుంబ సభ్యులను బెదిరించి వంశీపై ఓ తప్పుడు కేసు పెట్టించారు. టీడీపీ ప్రభుత్వంతో కుమ్మక్కై వంశీని అరెస్ట్ చేశారు. శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీస్ ఉన్నతాధికారులు అందుబాటులో లేరు.’’ అని అంబటి రాంబాబు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: