
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ తాజాగా అరెస్టు అయ్యి జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. వంశీ ని పరామర్శించేందుకు వైసిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా వచ్చారు .. అక్కడి వరకు బాగానే ఉంది. వంశీ తెలుగుదేశం పార్టీ నుంచి ఒకసారి విజయవాడ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయి .. రెండుసార్లు గన్నవరం ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. 2019 లో వైఎస్ జగన్ ప్రభంజనం లోనూ వంశీ రెండోసారి గన్నవరం ఎమ్మెల్యే గా గెలిచారు. గత ఎన్నికలకు ముందు వైసీపీలోకి వెళ్లిన వంశీ.. వైసీపీ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. అక్కడి వరకు బాగానే ఉంది. వంశీ గత ఎన్నికల ప్రచారంలో తనకు ఇవే చివరి ఎన్నికలు అని.. తాను వచ్చే ఎన్నికలలో పోటీ చేయను అని ప్రకటించారు.
వచ్చే 2029 ఎన్నికలలో వైసీపీ నేత దుట్టా రామచంద్ర రావు కుమార్తె పోటీ చేస్తారని.. ఈ ఒక్కసారికి తనను గెలిపించాలని చాలా వినయంగా గన్నవరం నియోజవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దుట్టా ఫ్యామిలీతో అప్పటికే ఉన్న విభేదాలు నేపథ్యంలో వంశీ.. దుట్టా ఫ్యామిలీ మొత్తాన్ని తన పక్కన కూర్చోబెట్టుకుని మరి మీడియా సమావేశంలో ఇవే తనకు చివరి ఎన్నికలు అని.. వచ్చే ఎన్నికలలో స్థానిక ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించారు. ఓటమి తర్వాత.. వంశీ రాజకీయంగా అంత యాక్టివ్గా లేరు. ప్రస్తుతం పలు కేసులలో అరెస్టు అయ్యి జైల్లో ఉన్నారు వంశీ. మరి వచ్చే ఎన్నికల నేపథ్యంలో.. నిజంగానే మాట మీద నిలబడతారా..? ఆయన ఎన్నికల్లో పోటీ చేయరా..? నిజంగానే దుట్టా కుమార్తెకు గన్నవరం వైసీపీ టికెట్ ఇస్తే ఆయన సపోర్ట్ చేస్తారా..? లేదా..? అన్న ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.