
ఈ వైరల్ వీడియోలో ఎలాన్ మస్క్, సుందర్ పిచాయ్, ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ వంటి ప్రపంచ దిగ్గజ వ్యాపారవేత్తలు కుంభమేళాలో దర్శనమిచ్చారు. ఎలాన్ మస్క్ అయితే ఏకంగా ట్రెడిషనల్ కుర్తా వేసుకొని, అక్కడి జనంలో కలిసిపోయినట్టు ఉన్నాడు. ముఖేష్ అంబానీ టీ కొట్టు నడుపుతూ కనిపించారు. ఇంకో సీన్లో ఆయన జియో స్టాల్ దగ్గర నిలబడి, ఆధ్యాత్మిక ప్రదేశంలో కూడా తన బిజినెస్ను విస్తరిస్తున్నట్టు కనిపించారు.
పాపులర్ సింగర్ బాద్షా కూడా ఈ వీడియోలో మెరిశాడు. దీంతో ఈ వీడియో మరింత వైరల్ అయిపోయింది. వీడియో ఇక్కడితో ఆగలేదు. ఫుట్బాల్ లెజెండ్స్ క్రిస్టియానో రొనాల్డో, లియోనెల్ మెస్సీ గంగా, యమునా, సరస్వతి నదులు కలిసే పవిత్ర సంగమంలో స్నానం చేస్తూ కనిపించారు. ఇది చాలదన్నట్టు, డొనాల్డ్ ట్రంప్, నరేంద్ర మోదీ, జార్జియా మెలోని వంటి ప్రపంచ లీడర్లు కలిసి స్నానం చేస్తూ కనిపించారు. ఇది నిజ జీవితంలో ఊహించలేని సీన్.
ఇంకాస్త ముందుకు వెళ్తే, హాలీవుడ్ స్టార్స్ విల్ స్మిత్, జెండాయా, టామ్ హాలండ్ కూడా ఈ వీడియోలో ప్రత్యక్షమయ్యారు. డిజిటల్ మాయ ఎంతలా పెరిగిపోయిందో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఈ వైరల్ వీడియో పెద్ద చర్చకు దారితీసింది. AI టెక్నాలజీ ఎంత అద్భుతంగా పనిచేస్తుందో ఇది చూపిస్తుంది. కానీ, డిజిటల్ మానిప్యులేషన్, తప్పుడు సమాచారం గురించి కూడా భయాలు మొదలయ్యాయి. AI ఇంత రియాలిటీగా వీడియోలు సృష్టించగలిగితే, నిజం ఏది, అబద్ధం ఏది అని ఎలా తెలుసుకోవాలి?
కుంభమేళా లాంటి పురాతన సంప్రదాయంతో AI టెక్నాలజీ కలవడం చూస్తుంటే ఒక విషయం మాత్రం నిజం.. టెక్నాలజీ మనల్ని ప్రపంచాన్ని చూసే విధానాన్ని పూర్తిగా మార్చేస్తోంది.