
ఎస్సెల్బీసీ వద్ద ప్రమాదం జరిగి ఎనిమిది మంది కార్మికులు సొరంగంలో చిక్కుకున్నారని... రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితులు ఉంటే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారని, గాల్లో చక్కర్లు కొడుతున్నారనికేటీఆర్ ఆరోపించారు. ఇప్పటి వరకు 35 సార్లు దిల్లీ వెళ్లిన రేవంత్ రెడ్డి చేసిందేమిటి.. తాజాగా 36వ సారి వెళ్లి చేసేదేమిటని కేటీఆర్ ప్రశ్నించారు. కనీసం మంత్రివర్గ విస్తరణ కూడా చేసుకోలేకపోతున్నారని ఎద్దేవా కేటీఆర్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజలకు విసుగొచ్చిందని.. రాష్ట్రానికి హోంమంత్రి, విద్యాశాఖ మంత్రి, సంక్షేమ శాఖ మంత్రి లేరని కేటీఆర్ ఆక్షేపించారు. మంత్రులను నియమించుకోలేని అసమర్థ సీఎం రేవంత్ రెడ్డి... కేసీఆర్ను, ఆయన ఆనవాళ్లు లేకుండా మాయం చేస్తానని అంటున్నారని కేటీఆర్ మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి నిద్రలో కూడా కేసీఆరే యాదికి వస్తున్నట్లుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. టకీటకీమని ప్రజల ఖాతాల్లో డబ్బులు పడడం లేదు కానీ... రాహుల్ , కాంగ్రెస్ పెద్దల ఖాతాల్లో డబ్బులు పడుతున్నాయని కేటీఆర్ ఆరోపించారు.
అందుకే రేవంత్ రెడ్డికి మార్కులు పడుతున్నాయని కేటీఆర్ అన్నారు. కడియం శ్రీహరి రాజీనామా చేసి ఉపఎన్నికలు ఎదుర్కోవాలన్న ఆయన... పదిస్థానాల్లో ఉపఎన్నికలు వచ్చి బీఆర్ఎస్ గెలుపు ఖాయమని కేటీఆర్ వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ రక్షణ కవచంలా నిలుస్తోందని కేటీఆర్ అన్నారు. ఎస్ఎల్ బీసీ ప్రమాదంపై బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు.