ఏపీలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు రేపే పోలింగ్ జ‌ర‌గ‌నుంది. రెండు పట్టభద్రుల, ఒక ఉపాధ్యాయ శాసన మండలి నియోజక వర్గాలకు జరుగుతున్న ఎన్నికల్లో అధికార టిడిపి కూటమికి ఎదురుగాలి వీస్తోంది. పోలింగ్‌ దగ్గర పడుతున్నకొద్దీ కూటమి అభ్యర్ధుల్లో ఓటమి గుబులు కనిపిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఈ స్థాయిలో కోడ్ ఉల్లంఘ‌న జ‌ర‌గ‌లేద‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. ఉత్తరాంధ్ర మూడు ఉమ్మడి జిల్లాల టీచర్స్‌ నియోజకవర్గం, ఉభయగోదారి, కృష్ణా-గుంటూరు గ్రాడ్యుయేట్‌ స్థానాలకు గురువారం పోలింగ్‌ జరుగుతోంది. ఈ మూడు స్తానాల్లో విజ‌యం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్‌ ప్రత్యేకంగా సమీక్షలు, టెలికాన్ఫరెన్స్‌లు తరచు నిర్వహించి జిల్లా, మండల, క్షేత్ర స్థాయి శ్రేణులను రంగంలోకి దించారు.


పెద్దల సభ సభ్యుల ఎన్నికలకు రాజకీయ పార్టీలు దూరంగా ఉంటాయి. కానీ ఈ మూడు చోట్ల గెలిచేందుకు తెలుగుదేశం స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతోంది. కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డిన 8 నెల‌ల్లో జ‌రుగుతోన్న ఎన్నిక‌లు కావ‌డంతో తమ అభ్యర్ధులు ఓటమి చెందితే ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత మొదలైందన్న సంకేతాలొస్తాయని చంద్ర‌బాబు, ప‌వ‌న్ కూడా ఈ ఎన్నిక‌లు ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని మ‌రీ ప్ర‌చారం చేశాయి. మ‌రీ ముఖ్యంగా కృష్ణా-గుంటూరు గ్రాడ్యుయేట్‌ నియోజకవర్గాన్ని కూటమి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప‌దుల సంఖ్య‌లో ఎమ్మెల్యేల‌ను మోహ‌రించి మ‌రీ ప్ర‌చారం చేసింది. అయితే ఇక్క‌డ పీడీఎఫ్ అభ్య‌ర్థి కేఎస్ ల‌క్ష్మ‌ణ‌రావు నుంచి మాజీ మంత్రి, కూట‌మి నుంచి పోటీ చేస్తోన్న ఆల‌పాటి రాజా గ‌ట్టి పోటీ ఎదుర్కొని ఏటికి ఎదురీదుతున్నారు.


మూడు చోట్ల కూడా పీడీఎఫ్ అభ్య‌ర్థులు గ‌ట్టి పోటీ ఇస్తున్నారు. కృష్ణా-గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గానికి కెఎస్‌ లక్ష్మణరావు, ఉభయ గోదావరి పట్టభద్రుల నియోజకవర్గానికి డి వీర రాఘవులు, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గానికి కె విజయగౌరి పోటీలో ఉన్నారు. వీరు ఉపాధ్యాయ‌, విద్యా, విద్యార్థుల స‌మ‌స్య‌ల మీద ఎప్పుడూ పోరాటం చేసే వారు కావ‌డంతో వీరికి క‌లిసి రానుంది. దీనికి తోడు డీఎస్సీ నోటిఫికేష‌న్ లేక‌పోవ‌డం, గ్రూప్ 2 ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ గంద‌ర‌గోళం, సీపీఎస్ ర‌ద్దు ఇవ‌న్నీ లేక‌పోవ‌డంతో ఆయా వ‌ర్గాల్లో తీవ్ర అసంతృప్తి క‌నిపిస్తోంది. ఇవ‌న్నీ కూట‌మి అభ్య‌ర్థుల‌ను బాగా టెన్ష‌న్ పెట్టేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: