
ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు పూర్తి బలం ఉన్నా టీడీపీకి కేవలం మూడు మాత్రమే దక్కుతున్నాయి. ఒకటి జనసేనకు ఇచ్చారు. దానిని పవన్ కళ్యాన్ తన సోదరుడు నాగబాబుకు ఇచ్చుకున్నారు. నాగబాబు ను కేబినెట్లోకి తీసుకోవడం ఖాయం కావడంతో ఆయనకు ఎమ్మెల్సీ తప్పక ఇవ్వాల్సిన పరిస్థితి. ఇక అనూహ్యంగా చివర్లో బీజేపీ కూడా ఓ ఎమ్మెల్సీ సీటు తీసుకుంది. ఈ సీటు నుంచి మాజీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు పేరును ఆ పార్టీ జాతీయ అధిష్టానం ఖాయం చేసింది. ఇక టీడీపీ కి చివరగా మూడు ఎమ్మెల్సీ సీట్లు మాత్రమే దక్కాయి.
బీజేపీ ప్రతి సారి మాకేంటి అన్నట్టుగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే ఆర్ కృష్ణయ్య విషయంలో రాజ్యసభ సీట్ తీసుకున్నారు .. వైసీపీ కి చెందిన విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన సీటులో వారే పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఓ ఎమ్మెల్సీ సీటు కూడా లాగేశారు. టీడీపీలో ఎమ్మెల్సీ సీటు హామీ పొందిన పిఠాపురం వర్మ , దేవినేని ఉమ .. కొమ్మాలపాటి శ్రీథర్ తో పాటు ఎంతో మందికి అవకాశాలు దక్కలేదు. భవిష్యత్ లో చాలా అవకాశాలు ఉంటాయి కానీ.. ఇప్పటికిప్పుడు తమకు ఎందుకు ఛాన్స్ ఇవ్వలేదని వారు ఎంతో ఫీలవుతున్నారు. వాస్తవానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీకి ఎమ్మెల్సీ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ వాళ్లు సీటు తీసుకోవడం తో పాటు టీడీపీ లో సీట్లు త్యాగం చేసిన వారికి ఎమ్మెల్సీ పదవులు రాని పరిస్థితి. బీజేపీ తీరు తో టీడీపీ త్యాగ రాజులు రగిలిపోతున్నారు. ఇలా ప్రతి సారి బీజేపీ సీటు తీసుకుని.. అటు జనసేన కూడా ఓ సీటు తీసుకుంటే టీడీపీ లో హామీ ఇచ్చిన వారికి ఎప్పటికి పదవులు వస్తాయో ? అన్న ఆందోళన వారికి ఉంది.