
యుగయుగాల దేవుడు మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి 12.00 గం.లకు నిర్వహించిన స్వామి వారి కల్యాణమహోత్సవంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, నారా బ్రాహ్మణి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీలక్ష్మీ నరసింహస్వామివారికి ప్రభుత్వం తరఫున నారా లోకేష్ దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు. వేద మంత్రో ఛ్చారణలు, మంగళవాయిద్యా ల మధ్య వైభవంగా జరిగిన స్వామి వారి కల్యాణాన్ని కనులారా వీక్షించి స్వామివారి అనుగ్రహం పొందారు. ఈ సందర్భంగా వేద పండితులు స్వామి వార్లకు విష్వక్షణ ఆరాధన , పుణ్యాహవాచనం రక్షాబంధనం, మధుపర్క నివేదన, స్వామి వారి పాద పక్షాలన, విశేష అర్చన, మహా సంకల్పం , ముత్యపు తలంబ్రాలు , బ్రహ్మముడి, మంగళహారతి తదితర పూజలు నిర్వహించారు.
మంత్రి నారా లోకేష్ దంపతుల రాకను పురస్కరించుకుని ప్రత్యేక ఆశీర్వచనాలు అందజేశారు. అంతకుముందు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి చేరుకున్న మంత్రి నారా లోకేష్ దంపతులకు ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఇక లోకేష్ మంగళగిరి నియోజకవర్గాన్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెద్ద ఎత్తున అభివృద్ంధి చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో మంగళగిరి లో లోకేష్ ఎమ్మెల్యే గా ఓడిపోయారు. కానీ ఐదేళ్ల పాటు ఇక్కడే ఎంతో కష్టపడి మరీ పని చేశారు. కసి తో మంగళగిరి లో మరోసారి పోటీ చేశారు. ఈ సారి సక్సెస్ అయ్యారు. ఏకంగా 92 వేల ఓట్ల భారీ మెజార్టీ తో విజయం సాధించారు. ఈ సారి మంత్రి గా కూడా ఉండడం తో లోకేష్ నియోజకవర్గం లో గతం లో ఎన్నడు కనివినీ ఎరుగరి రేంజ్ లో అభివృద్ధి పనులు చేసుకుంటూ దూసుకు పోతున్నారు.