
- జై శ్రీరామ్ అంటే కూటమి ప్రభుత్వంలో తప్పా
- పవన్ది సినిమాకో వేషం... పూటకో సిద్ధాంతం
- పోలీసుల అక్రమ కేసులపై బాబు నోరు మెదపరే
- కూటమి ప్రభుత్వ తీరు మార్చుకోవాలి
- బీసీవై జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్
ఏపీలో వెనకబడిన తరగుతుల అణిచివేతే లక్ష్యంగా కూటమి ప్రభుత్వ పాలన కొనసాగుతోందని బీసీవై జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ ఆరోపించారు. వెనకబడిన తరగతులకు చెందిన.. వెనకబడిన జాతులను ఏదో ఒకలా ఇబ్బంది పెట్టడమే ఈ ప్రభుత్వ లక్ష్యంగా కనపడుతోందని విమర్శించారు. కొద్ది రోజుల క్రితం రాయచోటిలో వీరబ్రహ్మేంద్ర స్వామి ఊరేగింపు సందర్భంగా పార్వేట ఉత్సవంలో ఇరువర్గాల మధ్య గొడవ జరగడం.. స్వామి ఊరేగింపును మరో వర్గం అడ్డుకోవడం తెలిసిందే. ఈ క్రమంలోనే రాయచోటిలో జరిగిన ఘటనకు సంబంధించి అక్రమ కేసులపై పోరాటం చేస్తానని బీసీవై బోడే రామచంద్ర యాదవ్ పిలుపు ఇచ్చారు. శనివారం రిమాండ్లో ఉన్న బాధితులను పరామర్శించిన ఆయన మీడియా సమావేశంలో కూటమి ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. చాలా బాధాకరమైన అంశం ఏంటంటే ఎక్కడైనా రెండు వర్గాల మధ్య సమస్య ఉన్నా లేదా ఘర్షణ జరిగినా దానిని శాంతియుతంగా పరిష్కరించాల్సిన పోలీసు అధికారులు కేవలం ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని విపరీతమైన సెక్షన్లతో కేసులు పెట్టి వేధించడం అనేది చాలా దారుణమైన విషయం అని మండిపడ్డారు. గత 70 - 80 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ప్రశాంతంగా జరిగే దేవుడి ఉత్సవాలలో చిన్నచిన్న సమస్యలను అడ్డం పెట్టుకుని ఉద్దేశపూర్వకంగా గొడవలు జరిగేలా చేసి అందులో అమాయకులను ఇరికించి ఇబ్బంది పెట్టారని రామచంద్ర యాదవ్ ఆరోపించారు. ఈ కార్యక్రమం చూస్తుంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పనితీరు ఎలా ఉందో ? పోలీసుల పనితీరు ఎలా ఉందో ? మనం గమనించవచ్చన్నారు.
ముఖ్యంగా గత ప్రభుత్వం హయాంలో అన్ని వర్గాల ప్రజలు ఒక రకంగా ఇబ్బంది పడితే.. ఈ ప్రభుత్వంలో అదే పద్ధతి కొనసాగుతోందే తప్ప.. ఎలాంటి మార్పు కనపడటం లేదన్నారు. గత ప్రభుత్వంలో దళితులు... బీసీలు.. మహిళలపై దాడులు జరిగాయి... అలాగే హిందువులు.. హిందూ సంప్రదాయాలు... హిందువుల పండుగలు, హిందూ పండుగలు ఊరేగింపుల పైన రకరకాల ఆంక్షలతో ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేశారని.. కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా అదే పద్ధతి నడుస్తోందని విమర్శించారు. కూటమి ప్రభుత్వంలోనూ హిందువులు చేసుకునే పండుగలు, మండపాలకు, ఊరేగింపులకు పర్మిషన్లు కావాలంటున్నారని.. దశాబ్దాల కాలం నుంచి జరుగుతున్న హిందూ సంప్రదాయాలను కొనసాగించాలంటే అనేక రకమైన ఆంక్షలు విధించే పరిస్థితి వచ్చిందని వాపోయారు. ఇప్పటివరకు ప్రతి ప్రభుత్వంలో కూడా దళితులపై దాడులు.. వెనకబడిన తరగతులను అణిచివేసే కార్యక్రమాలు చూసాము... నూటికి 90 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు ఉన్న ఈ రాష్ట్రంలో అన్ని రకాలుగా అణిచివేయబడుతున్న వర్గాలు కూడా వారే ఉన్నారన్నారు.
ఇప్పటి వరకు మనము వెనకబడిన తరగతులు.. వెనుకబడిన జాతులు... వెనుకబడిన కులాల గురించి చెప్పుకున్నాము.. ఈ రోజు దురదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో అత్యధిక జనాభా... సంఖ్యాబలం ఉన్న హిందూ మతం కూడా ఒక వెనుకబడిన మతంగా పరిగణించే పరిస్థితి వచ్చిందని... ఎందుకంటే ? హిందువులు, హిందూ సంప్రదాయాలపైనా, హిందూ దేవాలయాల పైన, హిందూ పండుగల పైన ఎలాంటి దాడులు జరిగినా ఈ రాష్ట్రంలో పట్టించుకునే వారే లేరని.. అందుకే కొందరు హిందువుల విషయంలో ఏదైనా చేయొచ్చ... ఎలాంటి సంఘటనలు జరిగిన హిందువులను హింసించవచ్చు అనే ఒక రకమైన ఆలోచనతో ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు.... పోలీసులు ఉన్నారని.. ఇందుకు రాయచోటి సంఘటన ప్రత్యక్ష ఉదాహరణ అని రామచంద్ర యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాయచోటిలో జరిగిన సంఘటనపై పోలీసులు కేసులు పెడుతూ ఎంతో మంది అమాయకులను ఇబ్బందులకు గురి చేశారు... ఈ కేసులో ఒక వర్గానికి సంబంధించిన వారు జైశ్రీరామ్ అంటూ రెచ్చగొట్టే కార్యక్రమం చేశారని పోలీసులు ఎఫ్ఐఆర్లో అనేక సెక్షన్లలో పెట్టి కేసులు పెట్టే ప్రయత్నం చేశారు... ఇది ఎంత దారుణమైన విషయం ? అని రామచంద్ర యాదవ్ తీవ్రంగా విమర్శించారు. ఈ రాష్ట్రంలో... ఈ దేశంలో జైశ్రీరామ్ అనే నినాదం పలికితే ఇది ఏమైనా నిషేధిత నినాదమా ? లేదా దీనిని నిషేధించారని ప్రభుత్వం ప్రకటన చేసిందా తెలియజేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉందన్నారు. భవిష్యత్తులో ఎవరైనా హిందూ ఊరేగింపులలో... హిందూ పండుగలో జై శ్రీరామ్ అని పలికితే ఇలాగే కేసులు పెట్టి వేధిస్తారని ఒక సంకేతాన్ని పోలీసుల ద్వారా ప్రభుత్వం ఇస్తుందన్న అనుమానాలు మనకు కలుగుతున్నాయన్నారు. దీనికి ప్రభుత్వంలో ఉన్నవారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని... ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో పాటు ఈ కూటమిలో ఉంటూ హిందువులకు మద్దతుగా మేము ఉన్నాం అని చెప్పే రాష్ట్ర బిజెపి నాయకులు.. అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు దీని మీద స్పందించాల్సిన అవసరం ఉందన్నారు.
ఇక గత కొద్ది రోజుల నుంచి ఈ రాష్ట్రంలో హిందూ ధర్మానికి... సనాతన ధర్మానికి ప్రతినిధి నేనే అని పవన్ కళ్యాణ్ చెప్పుకుంటున్నారు... మరి ఈ రాష్ట్రంలో హిందువుల పైన... మహిళల పైన అనేక రకాలుగా జరుగుతున్న దాడులు మీకు తెలియవా ? అని పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తున్నాను ... ఈరోజు రాష్ట్రంలో ఉన్న ఆశ్రమాలపై దాడులు జరుగుతున్నాయి ... సేవా కార్యక్రమాలను అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి... అయ్యప్ప స్వామి మాలలు వేసి దీక్షలు చేస్తుంటే వాటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు .. పండుగలు చేసుకుంటే మండపాలు పెట్టుకోనివ్వడం లేదు... ఎన్నో దశాబ్దాల కాలం నుంచి సాంప్రదాయంగా వస్తున్న పండుగలు .. ఊరేగింపులు చేసుకోవాలంటే కేసులు పెట్టి భయపెట్టే కార్యక్రమం చేస్తుంటే .. మరి నేను సనాతన ధర్మ పరిరక్షకుడు అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ గారు వీటి మీద ఎందుకు ? స్పందించడం లేదు .. ఆయన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.
పవన్ కళ్యాణ్ గారు సినిమాలలో చాలా బాగా నటిస్తారు .. ఆయన ఒక్కో సినిమాలో ఒక్క వేషం వేస్తున్నట్టుగా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అనేక వేషాలు మార్చారు .. చేగువేరా సిద్ధాంతంతో రాజకీయాల్లోకి వచ్చానని ... తర్వాత ద్రావిడ సిద్ధాంతం, పెరియార్ సిద్ధాంతం, బహుజన సిద్ధాంతం, పూలే సిద్ధాంతం ... తర్వాత బాప్టిజం తీసుకున్న క్రైస్తవ సిద్ధాంతం అన్నారు.. ఇలా రోజుకొక రకంగా.. పూటకో కొత్త రకంగా మాటలు మారుస్తూ చివరికి ఆయన ఇప్పుడు జపిస్తున్న సనాతన ధర్మం ఉందో లేదా దానిని కూడా వదిలిపెట్టేసి మరో సిద్ధాంతాన్ని తీసుకున్నారేమో చెప్పాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారి మీద ఉందని రామచంద్ర యాదవ్ ఎద్దేవా చేశారు.
ఈ రోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు అన్నింటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్న బిజెపి నేతలు నోరు విప్పాలన్నారు. ఇక చివరగా రాయచోటి సంఘటనలో బాధితులను పరామర్శించి.. వారికి కావలసిన న్యాయ సహాయం అందిస్తానని హామీ ఇచ్చానని... ఆ కుటుంబాలకు ఏ ఇబ్బంది ఉన్నా వారిని ఆదుకుంటానని బీసీవై పార్టీ తరఫున హామీ ఇస్తున్నాను... అయితే ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఒక్కటే డిమాండ్ చేస్తున్నాను... గత ప్రభుత్వ హయాంలో ఏవైతే తప్పులు చేశారో.... అంతకంటే దారుణమైన తప్పులు చేస్తున్నారు... ప్రజలను వేధించే కార్యక్రమం చేస్తున్నారు.. వీటిని మానుకుని అందరినీ సమానంగా చూడకపోతే రాబోయే రోజులలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తోందని ఈ ప్రభుత్వానికి రామచంద్ర యాదవ్ హెచ్చరికలు జారీ చేశారు.