
ఎన్టీఆర్ కృష్ణా జిల్లా తిరువూరు వైసీపీలో కుమ్ములాటలు మొదలయ్యాయి. ఇక్కడ వైసీపీకి చెందిన నగరపాలక సంస్థ చైర్పర్సన్పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు వైసీపీ కౌన్సెలర్లే సిద్ధమవుతున్నారు. వైసీపీ కౌన్సిలర్లు రెండు వర్గాలుగా విడిపోవడంతో నగర పంచాయతీ రాజకీయం వేడెక్కింది. చైర్పర్సన్ గత్తం కస్తూరిబాయిపై అవిశ్వాసం ప్రకటించిన అసమ్మతి కౌన్సిలర్లు కలెక్టర్ లక్ష్మీశకు నోటీసు అందించారు .. తిరువూరు మునిసిపాలిటీలో మొత్తం 20 మంది కౌన్సిలర్లలో అవిశ్వాసం నోటీసు ఇచ్చేందుకు సుమారు 11 మంది సంతకాలు అవసరం కాగా సంతకాలు సైతం సేకరించారు. .
మునిసిపాలిటీలో 20 వార్డులకు 17 స్థానాలు వైసీపీ గెలుపొందింది. ముందు చైర్మన్గా 15వ వార్డు నుంచి గెలుపొందిన మోదుగు ప్రసాద్ పేరును అధిష్టానం ప్రకటించింది. ఆ తర్వాత కొన్ని సామాజిక సమీకరణల నేపథ్యంలో కస్తూరిబాయికి పదవి కట్టబెట్టింది. ఆమె రెండేళ్ల తర్వాత రాజీనామా చేయాలని , ఆ తర్వాత ప్రసాద్ ను చైర్పర్సన్గా ఎంపిక చేయాలని అనుకున్నారు. అయితే ఇప్పుడు కస్తూరిబాయి గద్దె దిగలేదు . . పైగా అధిష్టానం ఆదేశిస్తే రాజీనామా చేస్తామని చెప్పడంతో వైసీపీ కౌన్సిలర్లలో అంతర్గత పోరు నెలకొంది. .
అవిశ్వాసానికి సిద్ధమైన కౌన్సిలర్లు తమ బలం పెంచుకునేందుకు మిగిలిన కౌన్సిలర్ల మద్దతు కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. అవిశ్వాసం నుంచి గట్టెక్కేందుకు ఇతర కౌన్సిలర్లు, నాయకులు వ్యూహ రచనలు చేస్తున్నారు. ఎక్కువ మంది పార్టీ అధిష్టానం ఆదేశాలకు కట్టుబడి ఉంటామని చెబుతున్నారు. మునిసిపాలిటీలో 20 మంది కౌన్సిలర్లలో 17 మంది వైసీపీ , ముగ్గురు టీడీపీ కి చెందినవారు ఉన్నారు. ప్రస్తుతం టీడీపీ కౌన్సిలర్ల మద్దతు ఎవరికి ? అనే అంశం హాట్ టాపిక్గా మారింది. ఈ అంశంలో తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు మాత్రం ఆచితూచి అడుగు వేస్తున్నారు.