
వైసీపీని ఖాళీ చేయడమే టీడీపీ కూటమి లక్ష్యమని బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజు చెపుతున్నారు. రెండో సారి ఎమ్మెల్సీ గా ఎన్నికైన వీర్రాజు ఈ సారి సౌండ్ గట్టిగానే చేశారు. ఏపీలో అభివృద్ధికి వైసీపీ పెద్ద అడ్డంకి అని కూడా స్పష్టం చేశారు. విశాఖ పర్యటనలో భాగంగా సోము వీర్రాజు వైసీపీ నుంచి వచ్చిన వారికి బీజేపీ కండువాలు కప్పారు. ఈ సందర్భంగా ఆయన మీడియా తో మాట్లాడారు. వైసీపీని మళ్ళీ జనాలు ఎన్నుకోరని .. ఈ విషయం లో ఆంధ్రప్రదేశ్ జనాలు చాలా స్పష్టంగా ఉన్నారని చెప్పారు. అసెంబ్లీకి వెళ్ళని వారికి పదవులు ఎందుకు అని జగన్ మీద కాస్త గట్టిగానే స్వరం పెంచి మరీ మాట్లాడారు. అసెంబ్లీ కి రావాలంటే జగన్ ప్రతిపక్ష హోదా కోరుతున్నారని ... కానీ ఇదే జగన్ కి 2014 నుంచి 2019 మధ్యలో ప్రధాన ప్రతిపక్ష హోదాకు సరిపడా సీట్లు ఇచ్చి జనాలు పంపించారని .. అప్పుడు జగన్ చేసిందేమిటి ? అని సోము నిలదీశారు.
అప్పుడు కూడా జగన్ తొలి మూడేళ్లు అసెంబ్లీకి హాజరై చేసిందేంటి ? అని కూడా సోము ప్రశ్నించారు. ప్రతిపక్ష హోదా ఇచ్చినా జగన్ చేసేదేమి ఉండదని సోము తేల్చేశారు. ఏపీలో పాలన గాడిన పెడుతోంది కూటమి ప్రభుత్వమే అని ... జగన్ పాలనలో ఏపీ అన్ని విధాలా వెనకబడి పోయిందని సోము ఎద్దేవా చేశారు. విశాఖను పాలనా రాజధాని అని చెప్పిన జగన్ విశాఖ అభివృద్ధికి ఒక్క రూపాయి అయినా ఇచ్చారా ? అని కూడా సోము ప్రశ్నించారు. కేవలం రుషి కొండ మీద ఐదు వందల కోట్ల తో విలాస వంతమైన భవనాన్ని జగన్ కట్టుకున్నారని .. వైసీపీ వల్లే ఏం కాదని తెలిసే ఏపీ జనాలు చిత్తుగా ఓడించారన్నారు. వైసీపీకి వచ్చే ఎన్నికల్లో 20 శాతం ఓట్లు వస్తే గొప్పే అని కూడా ఆయన అన్నారు.