తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి పేరు మారుమోగిపోతోంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి ఢిల్లీకి పదే పదే చక్కర్లు కొడుతూ వార్తల్లో నిలుస్తున్నారు. సంవత్సరంన్నర కాలంలో ఆయన ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్లారో లెక్కలు లేవు. ఇదిగో ఢిల్లీ అంటే అదిగో మంత్రివర్గ విస్తరణ అనే ప్రచారం ఊపందుకుంటుంది. ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయ్, సీనియర్లయిన బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు మళ్లీ పిలుపొచ్చిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇదిగో ఈసారి మంత్రివర్గ కూర్పు ఖాయమంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా అయిపోవడంతో విజయశాంతికి కూడా మంత్రి పదవి దక్కుతుందనే ఊహాగానాలు జోరందుకున్నాయి. మరి ఈ దఫా అయినా అది నిజమవుతుందా లేదా వేచి చూడాలి.

ఇదంతా ఒక ఎత్తయితే, రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏకంగా జపాన్ పర్యటనకు సిద్ధమయ్యారు. ఏప్రిల్ 15 నుంచి 23 వరకు తొమ్మిది రోజుల పాటు జపాన్‌లో పర్యటిస్తారు. తెలంగాణ సీఎం ఆఫీసు ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను ఖరారు చేసింది. ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం తెలంగాణకు పెట్టుబడులు ఆకర్షించడమే. జపాన్‌లోని ప్రముఖ కంపెనీలు, పెట్టుబడిదారులతో తెలంగాణకు వ్యాపార సంబంధాలు కుదుర్చుకోవడం, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం గురించి తెలుసుకోవడం ఈ పర్యటనలో ప్రధానాంశాలు.

అంతేకాదు, రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకమైన ఒసాకా వరల్డ్ ఎక్స్పో 2025లో కూడా పాల్గొనబోతున్నారు. ఏప్రిల్ 13న ప్రారంభమయ్యే ఈ వరల్డ్ ఎక్స్పో ఆరు నెలల పాటు కన్సాయ్, జపాన్‌లో అంగరంగ వైభవంగా జరగనుంది. ప్రపంచంలోని మేటి మేధావులు, దేశాలు పాల్గొనే ఈ అంతర్జాతీయ ప్రదర్శనలో తెలంగాణ తరపున రేవంత్ రెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. మొత్తానికి రేవంత్ ఢిల్లీ పర్యటనలు రాజకీయంగా హాట్ టాపిక్ అవుతుంటే, జపాన్ టూర్ మాత్రం అభివృద్ధిపై ఆయనకున్న ప్రత్యేక దృష్టిని చాటుతోంది. మరి రేవంత్ రెడ్డి ఈ టూర్ల ద్వారా తెలంగాణకి చివరికి మంచి చేశానని నిరూపించుకుంటారా లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: