
ఏపీ లో మల్టీప్లెక్స్ లు, మాల్స్ లో పార్కింగ్ ఫీజుల క్రమబద్ధీకరణ విషయంపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. మల్టీప్లెక్స్ లు మాల్స్ లో వాహన పార్కింగ్ రుసుములను ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. ఇష్టానుసారంగా రుసుములు వసూలు చేయకుండా కట్టడి చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఎలాంటి సందర్భంలో రుసుములు వసూలు చేయాలో నిర్దేశిస్తూ పురపాలక , పట్టణాభివృద్ధి శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే నెల 1 నుంచి కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయని పేర్కొంది.
ప్రభుత్వ తాజా నిర్ణయం ప్రకారం మొదటి 30 నిమిషాల వరకు పార్కింగ్ రుసుములు పూర్తిగా ఉచితం. తొలి అరగంట పాటు అసలు మాల్స్ లో ఉంటే వారు ఎలాంటి రుసుం చెల్లించాల్సిన పని లేదు. ఇక 30 నిమిషాల నుంచి గంట వరకు పార్కింగ్ చేసిన వ్యక్తులు మల్టీప్లె క్స్లు , మాల్స్ లో ఏదైనా వస్తువు కొన్నట్లుగా బిల్లులు చూపిస్తే అలాంటి వారికి రుసుములు వర్తించవు. బిల్లులు చూపనట్లయితే అలాంటి వారి నుంచి పార్కింగ్ రుసుములు వసూలు చేయొచ్చు.
అలాగే గంటకు పైగా చేసిన పార్కింగ్ పై వాహన చోదకులు సినిమా టికెట్, ఇత రత్రా బిల్లులు చూపినట్లయితే ఉచితం. ఆధారం చూపని వారి నుంచి రుసు ములు వసూలు చేయొచ్చు. బిల్లులు / సినిమా టికెట్లు చూపని వారి నుంచి రుసుములు ఎంత వసూలు చేయాలన్న దానిపై పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ స్పష్టత ఇవ్వలేదు. ఏదేమైనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తో ఇకపై మల్టీ ఫ్లెక్స్ లు ... మాల్స్ లోకి ఎంటర్ అయ్యే వారికి పార్కింగ్ ఫీజుల భారం తగ్గుతుంది. ఇప్పటికే ఈ విషయంలో వీరు ఇష్టం వచ్చినట్టుగా బాదేస్తున్నారు. ఇక పై కొంత భారం తగ్గుతుంది.