వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ ను.. ఆయన అధికారంలో ఉండగా అవినీతిలో మునిగి తేలిన నాయకులను.. కేంద్ర దర్యాప్తు బృందాలతో విచారించాలన్నది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంలో ముఖ్యపాత్ర పోషిస్తున్న.. టిడిపికి మనసు నిండా ఉన్న కోరిక. అయితే అది అంత సులువుగా జరుగుతుందా..? ప్రధాని ఎంత మనవాడే అయినా ఈ కోరిక నెరవేరుతుందా..? అనేది పెద్ద మిలియ‌న్ డాలర్ల ప్రశ్న. దీనికి కారణం ఆ ఊరుకు ఈ ఊరు ఎంత దూరమో.. ఈ ఊరుకు ఆ ఊరు కూడా అంతే దూరం అన్నట్టుగా.. మోడీ, జగన్ రాజకీయం కొనసాగుతుంది.


ప్రస్తుతం జగన్ పై ఉన్న అక్రమ ఆస్తుల‌ కేసుకు 11 ఏళ్లు అయినా ఒక అడుగు కూడా ముందుకు పడలేదు. పైగా ఆయా కేసుల్లో బెయిల్ పై ఉన్న జగన్.. ఇప్పటివరకు మళ్ళీ జైలు ముఖం కూడా చూసింది లేదు. అంతేకాదు అక్రమ ఆస్తులు ఎప్పుడు విచారణకు వస్తాయి కూడా తెలియదు. అవి ఏళ్ల‌కు ఏళ్లుగా నడుస్తున్నాయి. మరోవైపు సొంత బాబాయి వివేకానంద రెడ్డి దారుణ హత్య విషయంలోనూ అలాగే జరుగుతుంది. ఏడో సంవత్సరం వచ్చిన ఈ కేసు ఒక్క అడుగు కూడా ముందుకు కదలటం లేదు. ఈ నేపథ్యంలో జగన్ పై మరో కొత్త‌ కేసు నమోదు చేయాలన్నది రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న టిడిపి కోరికగా తెలుస్తోంది.


ఢిల్లీ మ‌ద్యం కుంభకోణం మాదిరిగానే.. ఏపీలోని మద్యం కుంభకోణం కేసును కేంద్రం పరిశీలించాలని కోరుతుంది. తాజాగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు నోటి నుంచి వచ్చిన మాట ఇది. ఏమంత వ్యక్తిగత విషయం కాదు. పైగా ఎంపీ లావు ఆ రేంజ్ లో జగన్ పై కేసును కదిపేసే అవ‌కాశం కూడా లేదు. చాలా వ్యూహాత్మకంగా ఎంపీ లావు పార్లమెంట్లో ఈ విషయాన్ని ప్రస్తావించారు. మరి ఇది సాధ్యమవుతుందా..? జగన్ పై టిడిపి కోరిక నెరవేరుతుందా..?  మ‌ద్యం కుంభకోణంలో జగన్ పై ఈడీసీబీఐ దర్యాప్తు సాధ్యపడుతుందా..? అంటే కాదు అని ఎక్కువ మంది అంటున్నారు. ఢిల్లీలో జరిగిన ఘటనకు.. ఏపీ ఘ‌ట‌నకు మధ్య ఒక్క పోలిక లేదు. ఢిల్లీలో బిజెపికి రాజకీయ ప్రయోజనాలు, అధికార‌ ప్రయోజనాలు ఉన్నాయి. ఏపీ విషయానికి వస్తే కేవలం పార్టీ పొత్తు మాత్రమే. అందుకని మోడీ.. ఇప్పుడు జగన్ విషయంలో ఇలా అడుగులు ముందుకు వస్తారని అనుకోలేము.

మరింత సమాచారం తెలుసుకోండి: