
ఆగస్టులో వివిధ రాష్ట్రాల విద్యామంత్రుల కాంక్లేవ్ ను రాష్ట్రంలో నిర్వహించేందుకు కేంద్రమంత్రి ఇప్పటికే అంగీకారం తెలిపినందున, అందుకు విస్తృతమైన ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో లెర్నింగ్ అవుట్ కమ్స్, మౌలిక సదుపాయాలు, విద్యార్థుల అటెండెన్స్ వివరాలు, పెండింగ్ ఫైల్స్ తదితర వివరాలతో పూర్తిస్థాయి డ్యాష్ బోర్డును మే నెలకల్లా సిద్ధం చేయాలని ఆదేశించారు. విద్యార్థులు లీప్ యాప్ ను అపార్ ఐడితో లాగిన్ అయి వీక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇప్పటివరకు అపార్ ఐడి నమోదు 85శాతం పూర్తయిందని, సాంకేతిక సమస్యలను అధిగమించి పూర్తిస్థాయి అపార్ ఐడి పూర్తిచేయాలని సూచించారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వ స్కూళ్లలో ఎట్టి పరిస్థితుల్లో డ్రాపవుట్స్ ఉండకూడదని, అందుకు తగ్గట్లుగా చర్యలు చేపట్టాలని అన్నారు. సర్వశిక్ష నిర్వహణలో కొనసాగుతున్న పాఠశాలల్లో ఆన్ లైన్ విధానంలో పారదర్శకంగా అడ్మిషన్లు చేపడతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుత సెలవుల్లో కెజిబివిల్లో టీచర్ల బదిలీలు పూర్తిచేసేందుకు మంత్రి అంగీకారం తెలిపారు.
అమరావతిలో సెంట్రల్ లైబ్రరీ, ట్రైనింగ్ అకాడమీ, ఆర్కివ్స్ మ్యూజియం నిర్మాణాలకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అన్నారు. విద్యార్థుల మేధస్సుకు పదును పెట్టే అధునాతన సాంకేతికతతో కూడిన క్లిక్కర్స్ ను తొలుత 9వతరగతి విద్యార్థులకు అందుబాటులోకి తేవాలని, పనితీరును బట్టి రాబోయే రోజుల్లో 6నుంచి 10తరగతులకు అమలు చేయాలని సూచించారు. జిఓ నెం.117కు ప్రత్యామ్నాయ జిఓను సాధ్యమైనంత త్వరగా సిద్ధం చేయాలని అన్నారు. ఈ విద్యాసంవత్సరం పాఠశాలలు తెరిచే రోజుకే పాఠ్యపుస్తకాలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే 48శాతం పుస్తకాల ముద్రణ పూర్తయినట్లు అధికారులు తెలిపారు.
రాష్ట్రంలో స్పెషల్ ఎడ్యుకేషన్ కు సంబంధించిన పోస్టులకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు అమలుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. టీచర్ల బదిలీలు, పదోన్నతులకు సంబంధించి ఎటువంటి పైరవీలకు తావులేకుండా నిబంధనలకు లోబడి పూర్తి పారదర్శక చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్, పాఠశాల విద్య డైరక్టర్ విజయరామరాజు, ఇంటర్మీడియట్ విద్య డైరక్టర్ కృతికా శుక్లా, కాలేజియేట్ ఎడ్యుకేషన్ డైరక్టర్ నారాయణ్ భరత్ గుప్త, సర్వశిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరక్టర్ బి.శ్రీనివాసరావు, ఎపిఇడబ్ల్యుఐడిసి ఎండి దీవెన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.