ఉక్రెయిన్ పైన రష్యా దండయాత్ర చేస్తున్న తరుణంలో రష్యా సైన్యంతో పాటుగా భారీ సంఖ్యలో చైనా దేశానికి చెందిన సైనికులు కూడా పోరాడుతున్నారనే ఉక్రెయిన్ వాదన పూర్తిగా నిరాధారమైనదని.. బీజింగ్ అధికారి ఒకరు తాజాగా ప్రకటించారు. విషయంలోకి వెళితే... తూర్పు డొనెట్స్క్ ప్రాంతంలో రష్యన్ సైన్యంతో కలిసి పోరాడుతున్న ఇద్దరు చైనీయులను ఉక్రెయిన్ సైన్యం పట్టుకుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ మంగళవారం ప్రకటించడం జరిగింది. ఈ క్రమంలోనే రష్యన్ దళాలతో భారీ స్థాయిలో చైనా దేశపు సైనికులు కూడా తమపై దాడికి దిగినట్టు సమాచారం ఉందని ఆయన ఆరోపించారు.

కాగా.. 'మా సైనికులు అంటూ ఎవరూ ఉక్రెయిన్ యుద్ధంలో లేరు.. ఈ వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమైనవి!' అంటూ జెలెన్ స్కీ ఆరోపణల్ని బీజింగ్ తోసిపుచ్చింది. ఈ సందర్భంగా చేసిన ప్రకటనలో బీజింగ్... "సాయుధ పోరాటాలు జరుగుతున్న చోటునుండి అందరూ దూరంగా ఉండాలి.. అని మేమే మా పౌరులకు శిక్షణలో భాగంగా చెబుతాం. అలాంటి మామీద ఇలాంటి ఆరోపణలు చేయడం తగదు. ఈ ఇరు దేశాల మధ్య యుద్ధంలో మేము ఇప్పటికీ తటస్తంగానే వ్యవహరిస్తున్నాం. మా మద్దతు ఎవరికీ ఉండదు... ఉండబోదు!" అని రాసుకొచ్చింది.

ఇకపోతే సుమారు 3 సంవత్సరాల రష్యా దండయాత్ర మధ్య ఉక్రెయిన్ తన గడ్డపై చైనా యోధుల గురించి ఆరోపణలు చేయడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. అంతేకాకుండా, ఉక్రెయిన్ సంక్షోభాన్ని రాజకీయంగా పరిష్కరించడంలో చైనా నిర్మాణాత్మక పాత్ర పోషించిందని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ బీజింగ్‌లో అన్నారు. ఈ సందర్భంగా లిన్ మాట్లాడుతూ... "చైనా ప్రభుత్వం ఎల్లప్పుడూ చైనా పౌరులను సంఘర్షణలకు దూరంగా ఉండాలని, ఏ విధమైన సాయుధ పోరాటంలోనూ పాల్గొనకుండా ఉండేందుకు నిరంతరం ప్రయత్నించాలని చెబుతూ ఉంటుంది." అని చెప్పుకొచ్చారు. ఇక సరిహద్దు వివాదం, ద్వైపాక్షిక సంబంధాలపై బీజింగ్‌లో భారత్, చైనా దౌత్య చర్చలు జరిపినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. మరోవైపు చైనా బంగ్లాదేశ్ తో సంబంధాలను మరింతగా పెంచుకుంది. రుణ చెల్లింపు, సుంకం రహిత యాక్సెస్‌ను పొడిగించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: