
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగడుగున ప్రశ్నించేందుకు.. సభను ప్లాట్ఫార్మ్ గా చేసుకొని రంగంలోకి దిగబోతున్నారు గులాబీ బాస్ కల్వకుంట్ల చంద్రశేఖర రావు. దీనికోసం 27వ తేదీన భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నారు గులాబీ నేతలు. ఇప్పటికే ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లు అన్ని పూర్తయ్యాయి. ఇలాంటి నేపథ్యంలో కెసిఆర్ కు ఊహించని షాక్ ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యూహరచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
కెసిఆర్ సభ కంటే ముందే... గులాబీ పార్టీని దెబ్బ కొట్టాలని అనుకుంటున్నారట. ఈ సభ జరగక ముందే ఐదుగురు ఎమ్మెల్యేలతో... రేవంత్ రెడ్డి స్కెచ్ వేసినట్లు చెబుతున్నారు. గులాబీ పార్టీకి సంబంధించిన ఐదుగురు ఎమ్మెల్యేలను... కాంగ్రెస్ లో చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేశారట సీఎం రేవంత్ రెడ్డి. ఆ దిశగా సీఎం రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నట్లు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు.
ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరిన పదిమంది ఎమ్మెల్యేల పరిస్థితి అత్యంత దారుణంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సమస్యల నేపథ్యంలో గులాబీ పార్టీ నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు ఎవరు పోతారు అనేదానిపైనా చర్చ జరుగుతుంది. అంత సాహసం ఎవరు చేయబోరని కూడా చెబుతున్నారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో చేరితే రాజకీయ భవిష్యత్తు నాశనం అవుతుందని కూడా అంచన వేస్తున్నారు ఎమ్మెల్యేలు. కాబట్టి మూడు సంవత్సరాలు సైలెంట్ గా కూర్చుండటమే మేలు... అని అనుకుంటున్నారట గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు. మరి ఈ విషయంలో రేవంత్ రెడ్డి ఎలా ముందుకు వెళ్తారో చూడాలి.