
రాజ్యంలోని కళాకారులంతా రంగులూ, కుంచె లేకుండా బొమ్మ గీయడం గురించి రేయింబవళ్ళు ఆలోచించినా వారికి ఏమీ తోచలేదు. దాంతో ఎవరూ ముందుకు రాలేదు. ఒక పల్లెటూర్లో ఉన్న వీరబ్రహ్మనికి మాత్రం రాజు ఇచ్చిన సవాలుకు ఎలాగైనా బదు లివ్వాలని ఉండేది. దాని గురించి నిరంతరం ఆయన ఆలోచించేవాడు. అలా ఓ రాత్రి తన మంచం మీద కూర్చుని ఆలోచిస్తుండగా, ఎదురుగా ఉన్న గూట్లో దీపం కాలగా వచ్చిన మసితో గోడ మీద నల్లని పోర ఏర్పడడం చూశాడు. 'భలే ఆలోచన వచ్చింది' అని అనుకుంటూ ఆ రాత్రికి నిద్రపోయి తెల్లవారే కోటకు వెళ్లి, తాను రంగులూ. కుంచే లేకుండా రాజు బొమ్మ గీస్తానని చెప్పాడు.
భటులు అతన్ని రాజు దగ్గరకు తీసుకువెళ్లారు. వెంటనే అతడు తన సంచి లోంచి ఒక దీపం కుందే, కాగితాన్ని తీశాడు. దీపాన్ని వెలిగించి.... ఓ కాగితం పూర్తిగా మసిబారేలా చేసాడు. తర్వాత ఎంతో చాకచక్యంగా తన వేళ్ళతో రాజు బొమ్మని ఆ కాగితం మీద చక్కగా గీశాడు. అతడి తెలివికి, ప్రతిభకూ ముగ్ధుడైన రాజు ఆ కళాకారుడిని ప్రత్యేకంగా సన్మానించి, చెప్పినట్టుగా నూరు బంగారు నాణ్యము లను కూడా అందించాడు. ఆలోచించే విధానం ఉండాలే కానీ ఎంతటి కష్టమైనా ఇట్టే సులభం అవుతుంది.