
వెంకటేశ్వరస్వామి అనగానే ముందుగా అందరికి గుర్తు వచ్చేది పుణ్యక్షేత్రాల్లో ఒకటైన చిత్తూరు జిల్లాలోని తిరుమల తిరుపతి దేవస్థానం. ఆ తర్వాత చిన్న తిరుపతి అని ఏలూరు దగ్గరలో ఉన్న ద్వారకా తిరుమలని ఎక్కువగా గుర్తు చేసుకుంటుందారు. ఇటు ఆంధ్రాకి తెలంగాణకి సరిహద్దుల్లో ఉన్నది ఈ గుడి. జమలాపురం అనే గ్రామంలో ఈ పుణ్య క్షేత్రం వెలసింది. ఇక ఈ ప్రాంతాన్ని గతంలో సూచీగిరి అనేవారు. అంటే సూదిలాగా వున్న పర్వతం. నిటారుగా వుండే ఈ చిన్ని కొండని ఎక్కటానికి భక్తులు చాలా కష్టపడాల్సి వచ్చేదిట. పూర్వం జాబాలి అనే ఓ మహర్షి ఇక్కడ తపస్సు చేసుకున్నారని, ఆయన కోరిక మీద శ్రీ వెంకటేశ్వరస్వామి ఇక్కడ వెలిశాడనీ పూర్వీకులు చెబుతుంటారు.
ఇక జాబాలి మహర్షి దశరధ మహారాజు కొలువులో ఆయన గురు స్ధానంలో ఉండేవారు. ఆయనకి శ్రీరాముడంటే అమితమైన ప్రేమ. ఇక ఆ రాములవారి భార్య సీతాదేవి, తమ్ముడితో వనవాసానికి వెళ్ళినప్పుడు జాబాలి మహర్షి రాముడి మీద ప్రేమతో వారిని వెనక్కి తీసుకు రావాలని ఎంతో ప్రయత్నించాడు. తండ్రి ఆజ్ఞ పాలించాలనే శ్రీరాముడి దృఢ సంకల్పంతో, ఇక ఆయన చేసేదేమి లేదని వెనకకి తిరిగి జాబిలి అయోధ్యకి తిరిగి వెళ్ళక తన శిష్యులతో తీర్ధయాత్రలను సేవిస్తూ ఉన్నారు. ఈ ప్రాంతానికి వచ్చి సూచీగిరి మీద తపస్సు చేసుకున్నాడని చెబుతారు.
ఈ సూచీగిరి కొండ మీద రెండు గుహలున్నాయి. జాబాలి మహర్షి తపస్సుకి మెచ్చి శ్రీహరి ఒక గుహలో స్వయంభూ వెంకటేశ్వరస్వామిగా వెలిశాడు. శ్రీహరి వెలిసిన గుహ కనుక దానిని వైకుంఠ గుహ అని పిలవడం జరిగింది. (దశరధ మహారాజు ఆస్ధానంలోని జాబాలి మహర్షి ఏమిటి, వెంకటేశ్వరస్వామి గురించి తపస్సు చెయ్యటం ఏమిటి వెంకటేశ్వరస్వామి కలియుగ దేవుడు కదా అని ఆశ్చర్య పడిపోకండి. వెంకటేశ్వరస్వామి కృతయుగంలోనే వెలిశాడనీ అంటుంటారు. అయితే ఈ శ్రీరామచంద్రుడు నారాయణాచలములోని వెంకటేశ్వరస్వామి దర్శించుకున్నాడని పురాణాల కథ ప్రకారం ఉంది.
ఇక రెండవ గుహ ద్వాపర యుగంలో అర్జనుడు పాశుపతాస్త్రం కోసం ఈ సూచీగిరికి తూర్పున వున్న ఇంద్రకీలాద్రి పై తపస్సు చేసేవాడు. ఆ సమయంలో శివుడు అర్జనుని శక్తి సామర్ధ్యాలను ఎలాగైనా పరీక్షించాలని మూకాసురుణ్ణి వరాహ రూపంలో పంపించాడట, మూకాసురుడి మీద అర్జనుడూ, శివుడూ ఇద్దరూ కలిసి వేసిన బాణాలు ఒకేసారి తగలటం, వారిద్దరి మధ్యా జరిగిన వాగ్వివాదం మనకు తెలిసినదే. అప్పుడు శివుడు అర్జనుణ్ణి మెచ్చుకుని పాశుపతం అనుగ్రహించాడు. ఈ బాణాలు తగిలి మూకాసురుడు అదృశ్యుడైన చోటే శ్రీ వెంకటేశ్వరస్వామి వెలసిన గుహ అని అంటారు. పార్వతీ పరమేశ్వరులు వున్న ప్రదేశం కైలాస గుహ అని అంటుంటారు. ఇక ఈ జాబాలి మహర్షి తపోదీక్షతో ప్రసిధ్ధమైన ఇక్కడ పుష్కరిణి చాలా శక్తి కల్లది అని అంటారు. ఇక్కడ స్నానం చేసిన అనేకమంది అనేక విధాల శాపాలు తొలగాయన్న కధలున్నాయి. అయితే కాల ప్రభావం వల్ల ఈ తీర్ధం ప్రస్తుతం అంతరించిపోయిందట.