ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కసారిగా విజయనగరం జిల్లా రామతీర్థం పుణ్యక్షేత్రం హాట్ టాపిక్ గా మారింది. రామతీర్థంలోని కోదండరాముడి విగ్రహ ధ్వంసంతో మొదలైన వివాదం ముగింపునకు నోచుకోవడం లేదు. రామతీర్థంలో విగ్రహ ధ్వంసం ఘటన అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే విజయనగరం జిల్లా రామతీర్థంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి సంక్రాంతి పర్వదినాన పర్యటించడం విశేషం. చినజీయర్ స్వామి పర్యటనలో భాగంగా కోదండ రామాలయాన్ని సందర్శించారు. అక్కడ కొండపైన ఆలయంలో దుండగులు ధ్వంసం చేసిన స్వామివారి విగ్రహం, ధ్వంసమైన స్వామివారి విగ్రహం లభించిన కొలనును ఆయన పరిశీలించారు. కోదండరాముడి విగ్రహ ధ్వంసం ఘటనకు సంబంధించిన వివరాలు అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
             రామతీర్థం విగ్రహ ధ్వంసం ఓ హెచ్చరిక వంటిదని చినజీయర్‌ స్వామి చెప్పారు. కాబట్టి, రాజకీయాలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న దేవాలయాలను సందర్శించనున్నట్లు చినజీయర్ స్వామి ప్రకటించారు. ఇక, రామతీర్థంలో ఏమాత్రం వసతులు లేని పరిస్థితిని మార్చాల్సి ఉందని చినజీయర్‌ స్వామి అన్నారు. ఇందుకు సంబంధించి రామతీర్థం ఆలయ నిర్మాణానికి ఆగమశాస్త్ర సూచనలు చేసినట్లు ఆయన చెప్పారు.ఈ నెల 17 నుంచి రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో కూడా పర్యటించనున్నట్లు చినజీయర్ స్వామి ప్రకటించారు. రాజకీయాలకు అతీతంగా ఆలయాల దర్శన యాత్ర చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్రంలోని ఆలయాల్లో ఘటనల తీరు, లోపాలను తెలుసుకునేందుకే పర్యటన చేస్తున్నట్లు చినజీయర్ స్వామి వివరించారు. లోపాలను సరిదిద్దేందుకు అవసరమైన చర్యలు సూచిస్తామని చినజీయర్‌ స్వామి తెలిపారు. అలాగే ఈ ఘటనలను హెచ్చరికగా తీసుకొని రాష్ట్రంలోని మారుమూల ఆలయాలను గుర్తించి ఏడాదిలోగా తగిన సదుపాయాలు కల్పించి, రక్షణ చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖకు ఆయన సూచించారు. రాష్ట్రంలోని ప్రతి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని.. భక్తులు నిత్యం వచ్చేలా ఆలయాలను తీర్చిదిద్దాలని చినజీయర్ స్వామి ఆకాంక్షించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: