
మానవజాతి కనుక భగవద్గీత సారాంశాన్ని తూచా తప్పకుండా అనుసరిస్తే ఎలాంటి కష్టాలను అనుభవించకుండా వారి జీవితం సాఫీగా సాగిపోతుందట. మనకు తెలిసిన పురాణాల ప్రకారం అర్జునిడికన్నా ముందే భగవద్గీత గురించి సూర్య భగవానుడికి తెలుసునట. ఎలా తెలుసని అర్జునుడు శ్రీకృష్ణుడిని అడుగగా, నీకు, నాకు కంటే కూడా ముందు చాలా జన్మలు జరిగాయని అన్నాడు. ఆ జననాల గురించి నీకు తెలియదని, నాకు తెలుసని బదులిచ్చాడు. ఆ తరువాత భగవద్గీత గురించి సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పడం జరిగింది. ఇతడికి వేదవ్యాసుడు దివ్య దృష్టిని ప్రసాదించాడు. ఆ దివ్యదృష్టి సాయంతో గీతా బోధనను దృతరాష్ట్రుడికి వినిపించాడు.
ఆ తరువాత మహాభారతాన్ని రచించిన శ్రీ వేద వ్యాసుడు శ్రీ గణేశుడికి గీతాబోధన చేసినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. అంతే కాకుండా వేద వ్యాసుడు తన శిష్యులైనటువంటి వైషాంపాయనుడు, జైమిని, పాలసంహితుడికి మహాభారతంలో లోతైన రహస్యాలను ఉపదేశించాడు. ఈ విధంగా మహాభారతాన్ని తన శిష్యులకు చెప్పాడు. ఈ గ్రంథంలోని ముఖ్యమైన ఘట్టాలను వారికీ ఉపదేశించాడు. దీని వలన భగవద్గీత గురించి సకల జనులు తెలుసుకోగలిగారు. వ్యాసుడు శిష్యుడు వైషాంయపనుడు జనమేజయుడికి మహాభారతం గురించి వివరించాడు. ఆ సమయంలోనే ఆయనకు భగవద్గీతను బోధించాడు. ఈ విధంగా అర్జునుడికన్నా ముందు భగవద్గీతను చాలా మంది తెలుసుకున్నారు.