నవంబర్ 14న ప్రారంభమై కోటి దీపోత్సవ మహోత్సవం మహోద్యమంగా కొనసాగుతోంది. నవంబర్ 27వరకు జరగనున్న ఈ దీపోత్సవంలో వేదికనెక్కే వేద పండితులు, అతిథులుగా హాజరయ్యే అతిరథమహారథులు, ప్రతిరోజూ వేలు, లక్షలుగా భక్త జనం పాల్గొంటున్నారు. లక్ష దీపాల అంకురార్పణతో ప్రారంభమైన ఈ మహాదీపయజ్జం.. కోటిదీపోత్సవంగా మారింది.. క్రమంగా ఆధ్యాత్మిక జగత్తులో మహోద్యమంగా కొనసాగుతోంది. ప్రతీ ఏడాది నిరాటంకంగా కొనసాగుతోంది. ఆ కైలాసమే ఇలకి దిగివచ్చిందా అనేలా.. కోటిదీపోత్సవ వేదికను ముస్తాబు చేశారు. ఒక్కసారైనా కోటిదీపోత్సవానికి వెళ్లాలి అనేలా భక్తులలో ఉత్సాహాన్ని కలిగిస్తోంది. ఇల కైలాసంగా మారిపోయిన ఎన్టీఆర్ స్టేడియం శివనామస్మరణతో మార్మోగుతోంది..
తొలి రోజు ఎన్టీఆర్ స్టేడియం పరిసర ప్రాంతాలు శివనామస్మరణతో మార్మోగాయి.. శ్రీశైలం మల్లన్న కల్యాణాన్ని చూసి తరించారు భక్తులు.. తొలి రోజే పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో.. కోటిదీపోతవ్సం వేదిక జనసంద్రంగా మారిపోయింది. 2వ రోజు కాణిపాకం వినాయక స్వామి కల్యాణం, మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి కల్యాణం.. కాజీపేట శ్వేతార్క మూలగణపతికి సప్తవర్ణ అభిషేకం,కోటి గరికార్చన.. మూషికవాహనంపై గణపతి ఉత్సవమూర్తుల ఊరేగింపు, మయూరవాహనంపై మోపిదేవి ఉత్సవమూర్తుల ఊరేగింపు ఇలా కన్నుల పండుగగా సాగింది.. ఇక, మూడో రోజు సకలదోషాలను హరించే అలంపురం జోగులాంబ కల్యాణం కన్నులపండువగా జరిగింది. హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభం కానున్న ఈ దీప యజ్ఞంలో పెద్ద సంఖ్యలో పాల్గొనండి.. తరలి రండి.. దీపయజ్ఞంలో పాత్రులు కండి.