జింబాబ్వేపై తొలి మ్యాచ్‌లో డకౌట్ అయిన యంగ్ అండ్ డైనమిక్ బ్యాటర్ అభిషేక్ శర్మ ఆ మరుసటి రోజే జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో విజృంభించాడు. ఈ క్రమంలో దూకుడుగా ఆడి కేవలం 47 బంతుల్లో సెంచరీ చేసి ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచాడు. దాంతో 2వ మ్యాచ్‌లోనే సెంచరీ అందుకున్న యువ ఆటగాడిగా రికార్డులు నెలకొల్పాడు. ఈ నేపథ్యంలో సర్వత్రా అభిషేక్ శర్మ సూపర్ సెంచరీ రహస్యం ఏమిటన్న అంశంపైన జనాలు ఎక్కువగా చర్చించుకోవడం జరిగింది. విషయం ఏమిటంటే... తన చిన్ననాటి స్నేహితుడు, ప్రస్తుత కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ వద్ద తీసుకున్న బ్యాటే తన సెంచరీ వెనుకున్న రహస్యమని అభిషేక్ శర్మ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

ఈ నేపథ్యంలో అభిషేక్ మాట్లాడుతూ... బాగా ఒత్తిడి అనిపించినపుడు అతడి వద్ద బ్యాట్ తీసుకొని ఆడుతూ ఉంటానని, ఇప్పుడు కూడా అదే పని చేసి అఖండ విజయం నమోదు చేశాననే సెంటిమెంట్‌ను బయటపెట్టాడు. ఒత్తిడిలో ఉన్నప్పుడు అతడి బ్యాట్ తీసుకొని ఆడితే కలిసొస్తుందని ఈ సందర్భంగా వివరించాడు. ఇకపోతే అండర్-12 నుంచి గిల్‌తో తన స్నేహ బంధం మొదలైందని, అతడితో స్నేహ బంధం చాలా గొప్పదని, వర్ణించడానికి విలుకానిది అని వ్యాఖ్యానించాడు. అండర్-12 నుంచి కలిసి ఆడే వాళ్లమని, తాను టీమిండియాకు ఎంపికైనప్పుడు మొదటి ఫోన్ కాల్ శుభ్‌మాన్ గిల్ నుంచే వచ్చిందని ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు అభిషేక్. జింబాబ్వేతో మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెస్ మీట్‌లో ఈ ఆసక్తికర విషయాలను పంచుకోవడం విశేషం.

అది మాత్రమే కాకుండా తాను భయం బెరుకు లేకుండా బ్యాటింగ్ చేయగలగడంలో భారత మాజీ బ్యాటర్ యువరాజ్ సింగ్‌ తనకి ప్రేరణ అని చెప్పుకొచ్చాడు. కాగా శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో డకౌట్ కావడంతో కాస్త ఒత్తిడిగా అనిపించిందని, దాంతో ఒత్తిడిని నియంత్రించుకునే విషయంలో కసరత్తులు చేసానని చెప్పుకొచ్చాడు. ఇదే సమయంలో యువ ఆటగాళ్లకు ఐపీఎల్ ఎంతో ఉపయోగపడుతోందని, అరంగేట్ర ఆటగాళ్లు భారత్ తరపున ఆడుతున్నప్పుడు పెద్దగా ఒత్తిడి కలగదని అన్నాడు. కాగా హరారే వేదికగా జింబాబ్వేతో ఆదివారం జరిగిన 2వ టీ20లో శుభమాన్ గిల్‌తో కలిసి ఓపెనర్‌గా వచ్చిన అభిషేక్ శర్మ దుమ్ము లేపాడు. జింబాబ్వే బౌలర్లను ఊచకోత కోసి 47 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో సెంచరీని పూర్తి చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: