టెస్టుల హడావుడి మొదలవ్వబోతోంది. సెప్టెంబర్ 19 నుంచి భారత్ - బంగ్లాదేశ్ జట్ల మధ్య 2 మ్యాచ్‌ల టెస్టు సిరీస్ షురూ కానుంది. మొదటి టెస్ట్ మ్యాచ్ చెన్నైలోని, ఎంఏ చిదంబరం స్టేడియంలో ప్లాన్ చేయగా రెండో టెస్టు సెప్టెంబర్ 27 నుంచి కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్‌లో ప్లాన్ చేసారు. ఇక ఈ సందర్భంగా టెస్టు క్రికెట్‌ విషయానికొస్తే... భారత్ - బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్‌లలో భారత జట్టుదే పైచేయి అని చెప్పవచ్చు. ఈ క్రమంలో రెండు దేశాల మధ్య మొత్తం 13 టెస్టు మ్యాచ్‌లు జరగ్గా, అందులో భారత్ 11 విజయాలు లిఖించడం కొసమెరుపు. ఇంతటి బలమైన రికార్డు ఉన్నప్పటికీ రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు బంగ్లాదేశ్‌ను ఇపుడు తేలిగ్గా తీసుకోలేకపోతోంది. విషయం ఏమిటంటే, ఇటీవల బంగ్లాదేశ్ స్వదేశంలో పాకిస్థాన్‌ను 2-0తో ఓడించడం. అందుకు మనవాళ్ళు ఆచితూచి అడుగు వేయాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అయితే భారత్ - బంగ్లాదేశ్ సిరీస్‌లో కొన్ని పెద్ద రికార్డులు కూడా సృష్టించవచ్చనే ఊహాగానాలు కూడా ఉన్నాయి. అలాంటి 4 రికార్డుల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

ఇందులో మొదటిది... సచిన్-ద్రావిడ్-గవాస్కర్ క్లబ్‌లోకి విరాట్ ఎంట్రీ ఇవ్వడం.. విరాట్ కోహ్లి టెస్టు క్రికెట్‌లో సరికొత్త మైలురాయిని సాధించే దిశగా అడుగులు వేస్తున్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో కోహ్లి 152 పరుగులు సాధిస్తే టెస్టు క్రికెట్‌లో 9వేల పరుగులు పూర్తి చేస్తాడు. భారత్ తరపున టెస్టు క్రికెట్‌లో 9 వేల పరుగులు చేసిన నాలుగో బ్యాట్స్‌మెన్‌గా విరాట్ నిలుస్తాడు. ఇక రెండవది... ‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మ సెహ్వాగ్ రికార్డుని బ్రేక్ చేయనుండడం... భారత కెప్టెన్ రోహిత్ శర్మ బంగ్లాదేశ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌లో రోహిత్ మొత్తం 7 సిక్సర్లు బాదితే భారత గ్రేట్ బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్ రికార్డును బద్దలు కొట్టినట్టే.

మూడవది... బ్రాడ్‌మన్‌ రికార్డ్ బద్దలు కొట్టనున్న విరాట్ కోహ్లీ... బంగ్లాదేశ్‌తో విరాట్ ఆడినప్పుడు, అతని దృష్టి అంతా బ్రాడ్‌మన్ రికార్డుపైనే ఉంటుంది. బంగ్లాదేశ్‌పై విరాట్ సెంచరీ సాధిస్తే బ్రాడ్‌మన్ 29 సెంచరీల రికార్డును బ్రేక్ చేస్తాడు.  జహీర్ రికార్డును అశ్విన్ బద్దలు కొడతాడా? స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మాజీ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్ రికార్డును బద్దలు కొట్టనున్నాడు. బంగ్లాదేశ్‌తో ఇప్పటివరకు 6 టెస్టులాడిన అశ్విన్ 23 వికెట్లు పడగొట్టాడు. రానున్న సిరీస్‌లో అశ్విన్ 9 వికెట్లు తీస్తే.. భారత్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన టెస్టులో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అవతరిస్తాడు.

తొలి టెస్టు మ్యాచ్‌ భారత జట్టు ఇదే:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సర్ఫరాజ్ ఖాన్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్), ఆర్ అశ్విన్, ధ్రువ్ జురెల్ (వికె), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, ఆకాష్ దీప్, యశ్ దయాల్.

మరింత సమాచారం తెలుసుకోండి: