సంజూ శాంస‌న్ గురించి క్రికెట్ క్రాడాభిమానులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. టీ20ల్లో టీమ్ఇండియా త‌రుపున అత్యంత వేగ‌వంత‌మైన సెంచ‌రీ ఘనత సాధించిన క్రమంలో సంజూ శాంస‌న్ రికార్డుల్లోకి ఎక్కాడు. హైద‌రాబాద్‌లోని ఉప్ప‌ల్ వేదిక‌గా బంగ్లాదేశ్‌తో జ‌రిగిన 3వ టీ20 మ్యాచులో అత‌డు ఈ రికార్డును సాధించడం విశేషంగానే చెప్పుకోవచ్చు. దీంతో అత‌డిపై సర్వత్రా ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది. త‌న‌కు అందివ‌చ్చిన అవ‌కాశాల‌ను ఎట్ట‌కేల‌కు న్యాయం చేశాడ‌ని అభిమానులు అభిప్రాయ పడుతున్నారు.

ఈ క్రమంలోనే త‌న‌కు ప‌రిమిత ఓవ‌ర్ల క్రికెట్‌తో పాటు టెస్టుల్లో కూడా ఆడాల‌ని ఉందంటూ సంజూ శాంస‌న్ త‌న మ‌న‌సులోని కోరిక‌ను వెలిబుచ్చాడు. టెస్టుల్లో ఆడేందుకు సిద్ధంగా ఉండాల‌ని కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌, హెడ్ కోచ్ గౌత‌మ్ గంభీర్‌లు సిద్ధం కమ్మన్నట్టు తెలిపాడు. అయితే.. అంత‌క‌ముందు మ‌రిన్ని రంజీట్రోఫీ మ్యాచులు ఆడాల‌ని కూడా సూచించినట్టు వెల్ల‌డించాడు. ఈ సందర్భంలోనే సంజూ టెస్టుల్లో రాణించ‌గ‌ల‌న‌నే న‌మ్మ‌కం నాకు ఉంది. ప‌రిమిత ఓవ‌ర్ల క్రికెట్‌కే ప‌రిమితం కావాల‌ని నేను అనుకోవ‌డం లేదంటూ టీమ్ఇండియా త‌రుపున టెస్టు క్రికెట్ ఆడాల‌నే కోరికని బయటకి తెలిపాడు. దాంతో అతని అభిమానులు, దానికి నువ్వు అర్హుడివి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో సంజూ శాంస‌న్ మాట్లాడుతూ... దులీప్ ట్రోఫీకి ముందే టీమ్ మేనేజ్‌మెంట్ నుంచి ఓ సందేశం నాకు రావడం జరిగింది. న‌న్ను టెస్టుల్లోకి ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటామ‌ని చెబుతూ, అందుకోసం మ‌రిన్ని రంజీ మ్యాచ్‌లు ఆడాల‌ని సూచించారు. అని శాంస‌న్‌ తెలిపాడు. కోచ్ గంభీర్‌, కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్ ఇచ్చిన మ‌ద్ద‌తుతోనే టీ20ల్లో శ‌త‌కం చేయ‌గ‌లిగిన‌ట్లు సంజూ శాంస‌న్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు. ఇంకా ఆయన మాట్లాడుతూ... "శ్రీలంక సిరీస్‌లో విఫ‌లం కావ‌డం వలన నేరుగా రాజ‌స్థాన్ అకాడ‌మీ వెళ్లిపోయాను. అక్క‌డ రాహుల్ ద్ర‌విడ్‌, జుబిన్ భ‌రుచా స‌మ‌క్షంలో విజయవంతంగా ట్రైనింగ్ తీసుకున్నాను. దులీప్ ట్రోఫీలో సెంచ‌రీతో రాణించ‌డం నాలో ఆత్మ విశ్వాసాన్ని పెంచింది." అని సంజూ శాంస‌న్ తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: